Kokapet & Khanamet Lands Row: కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అవినీతి ఆరోపణలు, స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి
File image of Telangana CM KCR | File Photo

Hyderabad, July 20:హైదరాబాద్‌లోని కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై (Kokapet & Khanamet Lands Auction) భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) స్పందించింది. భూముల వేలంపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది. బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకు మేలు చేశామన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను తగ్గించలేదు.. కల్పిత ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వేలం పారదర్శకంగా జరిగిందని పునరుద్ఘాటించింది.

వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదని పేర్కొంది. భూముల వేలానికి కొందరు ప్రతిపాదిస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ విధానం సరికాదని స్పష్టం చేసింది. ఆ పద్ధతి పోటీ కొందరికే అవకాశం లభిస్తుందని వివరించింది. భూముల వేలంపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంతో దాదాపు 3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

లబ్దిదారులకు నిరంతరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యం, తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోవాలి! తెలంగాణ దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, అధికారులకు దిశానిర్ధేశం

అయితే ఈ భూముల (Kokapet & Khanamet Lands) వేలంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భూముల వేలంతో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. దీన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. వేలంపై మరికొందరు కూడా విమర్శలు చేయడంతో ప్రభుత్వం స్పందించి పై ప్రకటనను విడుదల చేసింది.

భూముల వేలంకు సంబంధించి ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించామని, 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్‌ ఖరారు చేశామని ప్రభుత్వం తెలిపింది. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యం లేదన్న ప్రభుత్వం.. భూముల వేలానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి సరికాదంది. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని తెలిపింది. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నామని తెలిపిన సర్కారు.. పోటీని నివారించి, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తామని తన ప్రకటనలో పేర్కొంది.