![](https://test1.latestly.com/wp-content/uploads/2020/05/COVID-in-Telangana-380x214.jpg)
Hyderabad, October 12: తెలంగాణలో కొవిడ్ పాజిటివ్ కేసులు నిన్న భారీగా తగ్గాయి. సాధారణంగా 50 వేల టెస్టులు నిర్వహించే చోట ప్రతిరోజు సుమారు 2 వేల కేసుల వరకు నమోదవుతూ వచ్చేవి. వారాంతంలో నిర్వహించే టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటం, దీనికి తోడు హైదరాబాద్ సహా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండంటం మూలానా జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో కేసులు తగ్గాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 26,027 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 948 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1050 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,23,059కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 38,56,530 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 212 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 98, మేడ్చల్ నుంచి 65 కేసులు నిర్ధారణయ్యాయి. ఇక మిగతా జిల్లాల్లో కొవిడ్ పరిస్థితి ఎలా ఉందో కింద హెల్త్ బులెటిన్లో గమనించవచ్చు.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts1-11.jpg)
నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
![](https://test1.latestly.com/wp-content/uploads/2020/10/ts2-11.jpg)
మరోవైపు గత 24 గంటల్లో మరో 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1275కు పెరిగింది.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 1896 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,00,686 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.