
Hyd, Sep 15: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (Chief Minister K Chandrashekhar Rao) మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.
సచివాలయానికి అంబేద్కర్ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు.
పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు.