BL Santhosh Summoned By SIT: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలనం, ఏకంగా బీజేపీ ముఖ్యనేతకు సిట్ సమన్లు, విచారణకు హాజరుకావాలంటూ బీఎల్ సంతోష్కు సిట్ సమన్లు, ఈ నెల 21న రావాలంటూ నోటీసులు, రాకపోతే అరెస్ట్ చేస్తామన్న సిట్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు (BL Santhosh Summoned) నోటీసులు ఇచ్చింది సిట్. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో (SIT Office) విచారణకు హాజరుకావాలని సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది.
Hyderabad, NOV 18: ఫామ్ హౌస్ ప్రలోభాల కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు (BL Santhosh Summoned) నోటీసులు ఇచ్చింది సిట్. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో (SIT Office) విచారణకు హాజరుకావాలని సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో తెలిపారు సిట్ అధికారులు. ఎమ్మెల్యేల ప్రలోభాల (Trying To Buy MLAs) కేసులో ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు సిట్ అధికారులు. అక్టోబర్ 26న ఆడియో, వీడియో సంభాషణలకు సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించారు. వారితో సంబంధాలు ఉన్న వారికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అందులో ప్రధానంగా ఎన్డీయే కన్వీనర్ తుషార్ తో పాటు కేరళకు చెందిన వైద్యుడు డాక్టర్ జగ్గు స్వామి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు.
ఫ్లైట్ టికెట్ల కొనుగోలు కేసులో వీరందరి ప్రమేయం ఉందని, ఆడియో వీడియో సంభాషణల్లో వీరంతా మాట్లాడారు. పైలెట్ రోహిత్ రెడ్డితో (Pilot Rohith reddy) వీరంతా మాట్లాడారు. వీరి పేర్లు కూడా ప్రస్తావనకు రావడంతో వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంతోష్ కు (BL Santhosh) సైతం సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. బీఎల్ సంతోష్ బీజేపీలో అగ్రస్థానంలో ఉన్న నాయకుడు, కీలక లీడర్. అలాంటి వ్యక్తికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం.. బీజేపీ జాతీయ పార్టీలో (BJP) చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ నేతలు ఈ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఈ కేసులో ఇప్పటివరకు నలుగురికి నోటీసులు జారీ చేశారు. కేరళ, చిత్తూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆ ముగ్గురి స్టేట్ మెంట్ నమోదు చేయడం జరిగింది. అయితే, అక్టోబర్ 26న పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన సంభాషణలు, ఎమ్మెల్యేల ప్రలోభాలు, వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చారు అనే అంశాలపై సిట్ అధికారులు లోతుగా దర్యాఫ్తు జరుపుతున్నారు.
కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్య కళాశాలలో పని చేస్తున్న జగ్గుస్వామి ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయారు. జగ్గుస్వామి ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి అనుబంధంగా ఉన్న బీడీజెఎస్ (భారత్ ధర్మ జనసేన) అధ్యక్షుడు తుషార్కు సైతం సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
మరోవైపు సిట్ నోటీసులపై బీజేపీ (BJP) హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బి.ఎల్. సంతోష్, న్యాయవాది శ్రీనివాస్కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్ నోటీసులిచ్చి వేధిస్తోందని పేర్కొంటూ.. వీటిపై స్టే ఇవ్వాలని కోరారు.
ఈ కేసులో నలుగురికి (తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాస్, బీఎల్ సంతోష్) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందరికీ సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ కిందే నోటీసులు ఇచ్చారు. వారందరిని ఒకే రోజున విచారణకు పిలిచారు. ఒకేరోజున అందరినీ ప్రశ్నించనుంది సిట్. ఫామ్ హౌస్ ప్రలోభాల సమయంలో నిందితుల నోట బీఎల్ సంతోష్, తుషార్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తుషార్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడారు.
కాగా.. బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే ఆషామాషీ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది చాలా సీరియస్ అంశంగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న సంతోష్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. రాజకీయంగా దుమారం అని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నట్లుగా భావించాలి.
(The above story first appeared on LatestLY on Nov 18, 2022 11:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

