Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం..  నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్
ISRO (Credits: PTI)

Tirupati, Nov 18: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) నేడు మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ (Private Company) నిర్మించిన తొలి రాకెట్‌ను (Rocket) నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ (Skyroot) ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ (Vikram) సబార్టియల్ (వీకేఎస్). ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉదయం 11.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆటమిక్ ఎనర్జీ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరి కోట వస్తున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ప్రైవేట్ రాకెట్‌ను నింగిలోకి పంపడం ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం ఉనికిని పెంచేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ సింగిల్ స్టేజ్ స్పిన్ స్టెబిలైజ్‌డ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ బరువు దాదాపు 545 కేజీలు. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోతుంది. ఈ మొత్తం ప్రయోగం 300 సెకన్లలో ముగుస్తుంది.

తెలంగాణలో మళ్లీ 'కంటి వెలుగు'.. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం.. జనవరి 18 నుంచి రెండో విడత అమలు

ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ మాట్లాడుతూ.. విక్రం సిరీస్ ఆర్బిటల్ క్లాస్ స్పేస్‌లాంచ్ వెహికల్స్‌లోని మెజారిటీ సాంకేతికతలను పరీక్షించేందుకు విక్రమ్-ఎస్ సాయపడుతుందని పేర్కొంది. కాగా, ఈ ప్రయోగాన్ని ఈ నెల 12నే ప్రయోగించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో శాస్త్రవేత్తలు వాయిదావేస్తూ వస్తున్నాయి. చివరగా ఈరోజు ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించాలని తాజాగా నిర్ణయించారు.