PSLV-C51/Amazonia-1 Mission: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి, 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌, ఒక శాటిలైట్‌లో తొలిసారిగా అంతరిక్షంలోకి మోదీ ఫొటో, భగవద్గీత
PSLV-C51 Launch (Photo Credits: ANI)

Sriharikota, February 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నమ్మినబంటు పీఎస్ఎల్వీ (PSLV-C51/Amazonia-1 Mission) రాకెట్ మరోసారి తనకున్న గుర్తింపును సార్థకం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ51 వాహకనౌక అనుకున్న పని పూర్తి చేసింది. అనుకున్న సమయానికే రోదసిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. పీఎస్‌ఎల్‌వీ సీ 51 ద్వారా బ్రెజిల్‌ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్‌–1 నానో కాంటాక్ట్‌–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్‌ ఇండియా పేరుతో భారత ప్రైవేట్‌ సంస్థలకు చెందిన సతీష్‌ ధవన్‌ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్‌ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వీటిలోని ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత (Bhagavad Gita, PM Narendra Modi’s Photograph) అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.

2021లో తొలి హిట్ వైపు ఇస్రో గురి, పీఎస్‌ఎల్వీ సీ – 51 కౌంట్‌డౌన్ స్టార్ట్, అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలు రోదసిలోకి

అన్ని దశల్లోనూ రాకెట్ పనితీరు సవ్యంగానే ఉందని, బూస్టర్లు, ఉపగ్రహాలు సజావుగా విడివడ్డాయని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. కాగా, ఈసారి ప్రయోగానికి ఓ ప్రత్యేకత ఉంది. బ్రెజిల్ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి మార్కస్ క్వాంటస్ ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు శ్రీహరికోట వచ్చారు. విదేశీ అతిథి సమక్షంలో పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.

కాగా, ఈసారి పీఎస్ఎల్వీ రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో బ్రెజిల్ కు చెందిన అమెజానియా-1 కూడా ఉంది. దీనిపై శివన్ మాట్లాడుతూ, బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో చేపట్టిన మొదటి ప్రయోగం సఫలం కావడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు.

పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 53వ రాకెట్ ప్రయోగం కాగా, శ్రీహరికోట నుంచి జరిగిన 75వ ప్రయోగం. ఇక భారత్ కు చెందిన ఓ ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఫొటో, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ పేరు, భగవద్దీత, 25 వేల మంది పేర్లను పంపారు. ఈ పేర్లలో 1000 మంది విదేశీయులతో పాటు చెన్నై విద్యార్థుల పేర్లు కూడా ఉన్నాయి.