Sravani Suicide Case: పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అశోక్‌రెడ్డి, ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల రిమాండ్‌ రిపోర్టు, ఏ1గా దేవ్‌రాజ్‌, ఏ2గా సాయికృష్ణారెడ్డి, ఏ3గా అశోక్‌రెడ్డి
RX 100 producer Ashok Reddy (Photo-Twitter/@AshokGummakonda)

టీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. పంజాగుట్ట ఏసీపీ (Panjagutta ACP) తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్‌ రెడ్డి, ఏ 2 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య (Sravani Suicide Case) చేసుకుందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, అశోక్‌రెడ్డి ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత (RX 100 producer Ashok Reddy) అన్న సంగతి తెలిసిందే.

కాగా సోమవారం ఎస్ఆర్‌నగర్ పోలీసుల ముందు విచారణకు వస్తానని చెప్పిన అశోక్‌రెడ్డి రాలేదు. దీంతో పంజాగుట్ట పోలీసులు గాలించి పట్టుకున్నారు. సినిమాలో అవకాశాల పేరుతో శ్రావణిని అశోక్‌రెడ్డి పరిచయం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. కుటుంబ సభ్యుల ముందు దేవ్ రాజ్‌రెడ్డికి శ్రావణి ప్రపోజ్ చేసింది. శ్రావణి కుటుంబ సభ్యులు దేవ్‌రాజ్‌ను అడగడంతో ఒప్పుకోలేదు. శ్రావణి దేవ్‌రాజ్‌ను ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే సాయి కృష్ణ, అశోక్ రెడ్డి‌లతో శ్రావణి రిలేషన్ ఉండటంతో దేవ్‌రాజ్ ఒప్పుకోలేదని విచారణలో తేలింది.