YSR Yantra Seva Scheme: 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ జమ, 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్ హార్వెస్టర్లు పంపిణీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
Jagan Drives Tractor Video

Amaravati, June 7: గుంటూరులో సీఎం జగన్ పర్యటించారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని (YSR Yantra Seva Scheme) ప్రారంభించారు. ట్రాక్టర్, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని సైతం ప్రారంభించారు. ఈ క్రమంలోనే 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్ హార్వెస్టర్లను పంపిణీ చేశారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ (CM YS Jagan Mohan Reddy) మాట్లాడుతూ.. ‘‘ ప్రతి అడుగులో రైతుకు తోడుగా ఆర్బీకేలు ఉన్నాయి. ఆర్బీకేల్లో యంత్ర పరికరాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.

రాబోయే రోజుల్లో రూ.2,016 కోట్ల విలువైన పరికరాలు అందిస్తాం. చంద్రబాబు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. గతంలో డీలర్లతో కలిసి మంత్రులు స్కాంలు చేశారు. ప్రజలు గతానికి.. ఇప్పటికి తేడా గమనించాలి. ఇప్పుడు రైతులు వారికి కావాల్సిన ట్రాక్టర్లను వారే కొనుగోలు చేస్తారు. అవినీతి లేకుండా వ్యవస్థను క్లీన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Here's AP CMO Tweet

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లాలోని చుట్టగుంట వద్ద 'వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్నిజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక రైతు గ్రూపుతో కలిసి సీఎం జగన్‌ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి సీఎంతో ఉన్నారు.

సీఎం జగన్ స్వీచ్ హైలెట్స్

ఈ రోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ నిర్మించాం. ఆర్బీకేలు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ.. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ తోడుగా నిలబడుతున్నాయి. 10,750 రైతు భరోసా కేంద్రాలలో వ్యవసాయం ఇంకా మెరుగుపర్చేందుకు, రైతుకు కావాల్సిన పనిముట్లన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే, అదే గ్రామాల్లోనే తక్కువ ధరలోనే వారికి అందుబాటులో వచ్చేందుకు రైతులతోనే గ్రూపులు ఏర్పాటు చేసి ఆ రైతులకే ప్రభుత్వం తరపున 40 శాతం రాయితీ ఇస్తున్నాం.

రైతు గ్రూపుతో కలిసి ట్రాక్టర్‌ నడిపిన సీఎం జగన్, వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం ప్రారంభం కార్యక్రమంలో ఆసక్తికర ఘటన

మరో 50 శాతం రుణాలు తక్కువ వడ్డీకే బ్యాంకులతో మాట్లాడి మంజూరు చేయిస్తున్నాం. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు.. వాళ్లకు గ్రామంలో వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ కూడా ఆర్బీకే పరిధిలోనే సరసమైన ధరలకే అందుబాటులో ఉంచే గొప్ప కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే ఈరోజు రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ రూ.15 లక్షలు విలువగల 10,750 వైఎస్సార్‌ యంత్రసేవా కేంద్రాలను స్ధాపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోక్కటి రూ.25 లక్షలు విలువ గల కంబైన్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్‌ స్ధాయి యంత్రసేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.

ఇవాళ ఆర్భీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3800 ట్రాక్టర్లను అందజేస్తున్నాం. రాబోయే రోజుల్లో 10,750 రైతు భరోసా కేంద్రాలన్నింటికీ కూడా ఈ సేవలన్నీ విస్తరిస్తాయి. అందులో భాగంగా ఈ రోజు 3,800 ట్రాక్టర్లతో పాటు 1140 ఆర్బీకే స్ధాయి యంత్ర సేవా కేంద్రాలకు ఇతర వ్యవసాయ యంత్రపరికరాలను కూడా అందిస్తున్నాం. క్లస్టర్‌ స్దాయి యంత్రసేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ కూడా జరుగుతుంది. 5,260 రైతు గ్రూపుల బ్యాంకుల ఖాతాల్లోకి రూ.590 కోట్లు విలువచేసే సామాన్లుకు సంబంధించిన.... రూ.175 కోట్ల సబ్సిడీని కూడా ఈ కార్యక్రమంలోనే వారి ఖాతాల్లోకి బటన్‌ నొక్కి జమ చేస్తున్నాం.

ఆరోగ్యం బాగాలేని వారికి 10వ తరగతిలో పాస్ మార్కులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్, అదంతా పుకారని, అలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని తెలిపిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా నేడు పంపిణీ చేస్తున్న వ్యవసాయ యంత్రపరికరాలన్నీ కలిపి ఇప్పటికి 6780 ఆర్బీకేల్లోకి, మరో 391 క్లస్టర్‌ స్దాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లకు దాదాపు రూ.700 కోట్ల విలువ గల ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసినట్లవుతుంది. రాబోయే రోజుల్లో సంవత్సరం తిరక్క మునుపే రూ.2016 కోట్ల విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఆర్బీకేల పరిధిలో రైతుల చేతుల్లో పెట్టబోతున్నాం. ఇవన్నీ దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతోనే సాధ్యమైంది. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ... మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను.

ఒక చిన్న తేడాను గమనించమని ప్రతి రైతన్నను కోరుతున్నాను. ఇదే కార్యక్రమంలో భాగంగా గతంలో చంద్రబాబునాయుడు హయాంలో అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. అవి కూడా రైతులు ఎవరూ కూడా వాళ్లు ట్రాక్టర్ల ఆర్డర్లు ప్లేస్‌ చేయలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబునాయుడు అంతా కలిసికట్టుగా ట్రాక్టర్ల డీలర్లతో స్కామ్‌లు చేశారు. అప్పటికీ ఇప్పటికీ తేడాను గమనించండి. ఈ రోజు ట్రాక్టర్‌ దగ్గర నుంచి ఏ పనిముట్టు కావాలన్నా నేరుగా రైతు ఇష్టానికి వదిలిపెట్టాం. రైతు ఏ ట్రాక్టర్‌నైనా తనకు నచ్చిన కంపెనీ, తనకు నచ్చిన పనిముట్టు తానే ఆర్డర్‌ ప్లేస్‌ చేస్తాడు. సబ్సిడీ ప్రభుత్వం రైతుకు ఇస్తుంది.

అందులో భాగంగానే ఇవాళ రూ.175 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అవినీతి లేకుండా ఏ రకంగా వ్యవస్ధను క్లీన్‌ చేస్తున్నామో.. గమనించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా చూడండి. ఇవాళ 175 ట్రాక్టర్ల మోడళ్లలో రైతులకు నచ్చిన మోడల్‌ కొనుగోలు చేసే అవకాశం ఇచ్చాం అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.