AP EAMCET 2020 Web Options: ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్..ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చని తెలిపిన కన్వీనర్ ఎం.ఎం.నాయక్
Amaravati, Dec 28: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్లో కీలకమైన ఎంపీసీ స్ట్రీమ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ (AP EAMCET Web Options 2020) ప్రారంభం అయింది. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు, జనవరి 1న ఆప్షన్లను సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 88,667 మంది అభ్యర్థులు ఎంసెట్ కౌన్సెలింగ్కు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా రిజిస్టర్ కానివారికి కూడా ధ్రువపత్రాల పరిశీలనకు వీలు కల్పిస్తున్నారు. ఇలాంటివారు ఈనెల 28 నుంచి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొనవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెల్ప్లైన్ కేంద్రాలను జనవరి 1వ తేదీవరకు కొనసాగించాలని కన్వీనర్ నిర్ణయించారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లల ధ్రువపత్రాల పరిశీలనను ఈనెల 29న విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో చేపట్టనున్నారు.
రిజిస్టర్ అయి ఉన్న వారు మొబైల్ నంబరు మార్పు, లాగిన్ ఐడీ తదితర అంశాలపై హెల్ప్లైన్ కేంద్రాల సహకారం తీసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం అభ్యర్థులు https://apeamcet.nic.in/Default.aspxను చూడవచ్చు. వెబ్ ఆప్షన్ల నమోదులో సమస్యలు ఎదురైతే వాటిని నివృత్తి చేసేందుకు కమిషనరేట్లో మూడు హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వాటికి ఫోన్చేసి తమ సందేహాలను పరిష్కరించుకోవచ్చు. జనవరి 1వ తేదీన అభ్యర్థులు తమ ఆప్షన్లలో పొరపాట్లు సవరించుకునే అవకాశం ఉంది. అనంతరం 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు.
హైల్ప్లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995681678
ప్రభుత్వ, ప్రయివేటుకు సంబంధించి 257 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,29,016 సీట్లు, 120 ఫార్మసీ కాలేజీల్లో 10,675 బీఫార్మసీ సీట్లు, 62 కాలేజీల్లో 1,860 డీఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా ఇంజనీరింగ్లో 82 కాలేజీలు, బీఫార్మసీలో 19 కాలేజీలు, డీఫార్మాలో 7 కాలేజీలు యూనివర్సిటీలకు వివిధ రుసుములు బకాయి ఉండడంతో వాటిలోని 35,347 ఇంజనీరింగ్, 1,660 బీఫార్మసీ సీట్లు, 210 డీఫార్మా సీట్లను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.
ఆ కాలేజీలనుంచి అఫిడవిట్లు తీసుకుని ఆ సీట్లను కూడా విద్యార్థులకు కౌన్సెలింగ్లో అందుబాటులో ఉంచనున్నారు. అవికూడా జత అయితే సీట్లసంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ వర్సిటీల పరిధిలోని 18 ఇంజనీరింగ్ కాలేజీల్లో 5,212 సీట్లు, 9 బీఫార్మసీ కాలేజీల్లో 520 సీట్లు, 1 డీఫార్మసీ కాలేజీలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవికాక మిగిలిన సీట్లు ప్రయివేటు కాలేజీలకు సంబంధించినవి.
ఈనెల 3వ తేదీ సాయంత్రానికి సీట్ల కేటాయింపు పూర్తిచేసి 4 లేదా 5వ తేదీనుంచి తరగతుల ప్రారంభించాలని సూచిస్తున్నామని కన్వీనర్ తెలిపారు. మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యాక రెండు, మూడో విడత సీట్ల కేటాయింపు చేస్తాం. ఎంపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు పూర్తయ్యాక జనవరి 9 నుంచి బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ చేపడతాం. ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 28, 2020 12:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

