Republic Day Parade 2020: రిపబ్లిక్ శకటాలపై రాజకీయం, పరేడ్‌లో చోటు దక్కకపోవడంపై పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం, గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో అలరించనున్న శకటాలు ఇవే
File image of Republic Day parade (Photo Credits: IANS)

New Delhi, January 3:  రిపబ్లిక్ డే 2020 పరేడ్ (Republic Day 2020 parade) కోసం  పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ శకటాల (tableaux)కు చోటు దక్కకపోవడంపై రాజకీయంగా వివాదం చెలరేగింది. తమ శకటాలకు అనుమతి తిరస్కరించడం పట్ల మహారాష్ట్ర, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీయేతర రాష్ట్రాల (Non-BJP States) పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నిరసన వ్యక్తం చేస్తున్నందునే పశ్చిమ బెంగాల్ (West Bengal) శకటాన్ని మోదీ ప్రభుత్వం తిరస్కరించి, బెంగాలీలను అవమానించింది అని అధికార టీఎంసీ పార్టీ విమర్శించింది.

అయితే, పశ్చిమ బెంగాల్ శకటం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే ఆ శకటాన్ని తిరస్కరించినట్లు బీజేపీ పేర్కొంది. ఇక మరికొన్ని ఇతర రాష్ట్రాల శకటాలు సెలెక్షన్ ప్యానెల్ కమిటీ అంచనాలకు తగినట్లు లేవు, వచ్చిన ప్రతిపాదనల్లో అత్యుత్తమంగా ఉన్నవాటినే ఎంపిక చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 32 ప్రతిపాదనలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు 24 ప్రతిపాదనలు రాగా, మొత్తం 22 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో రాష్ట్రాలు మరియు యూటీలకు చెందిన శకటాలు 16 ఉన్నాయి.

రిపబ్లిక్ డే పరేడ్ 2020లో అలరించనున్న శకటాలు

 

ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌ఘర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.

రాష్ట్రాలు, యూటీల శకటాలతో పాటు...

పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య  విభాగం

తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ

ఆర్థిక సేవల విభాగం

NDRF మరియు హోంశాఖ

CPWD, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ

అనే ఆరు మంత్రిత్వ శాఖల విభాగాల శకటాలు పరేడ్ లో పాల్గొననున్నాయి.