Assembly Elections 2022: మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు, తీర్పు ఇవ్వనున్న 18.34 కోట్ల మంది ఓటర్లు, ఫిబ్రవరి 10 నుంచి ఏడు విడతల్లో పోలింగ్, మార్చి 10న ఓట్ల లెక్కింపు
Chief Election Commissioner (CEC) Sushil Chandra (Photo/ ANI)

New Delhi, jan 8: ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును (Assembly Elections 2022 Dates ) ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది. కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో (UP, Punjab, Uttarakhand, Manipur, Goa) అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. యూపీలో ఏడు దశలు, మణిపూర్‌లో రెండు దశలు, గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని, ఉత్తర ప్రదేశ్‌లో తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న (Voting to Take Place Between Feb 10 And March 7) జరుగుతుందని తెలిపారు. రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న, మూడో దశ పోలింగ్ ఫిబ్రవరి 20న, నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న, ఐదో దశ పోలింగ్ ఫిబ్రవరి 27న, ఆరో దశ పోలింగ్ మార్చి 3న, ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరుగుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని తెలిపారు.

ర్యాలీలు, రోడ్‌ షోలు, సభలు నిషేదం, డిజిటల్ ప్రచారం చేసుకోండి, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై కోవిడ్ ఎఫెక్ట్, జనవరి 15 వరకు అమల్లో నిషేదం

అసెంబ్లీ ఎన్నికలు పూర్తి వివరాలు

ఉత్తర ప్రదేశ్ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 14న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 21 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 27. కాగా పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగుతుంది.

ఫిబ్రవరి 14న ఉత్తర ప్రదేశ్‌లో రెండో దశ, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ జనవరి 21న జారీ అవుతుంది. అభ్యర్థులు జనవరి 28 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 31.

ఉత్తర ప్రదేశ్ మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 25న జారీ అవుతుంది, ఫిబ్రవరి 1 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఫిబ్రవరి 4. కాగా పోలింగ్ ఫిబ్రవరి 20న జరుగుతుంది.

ఉత్తర ప్రదేశ్ నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 27న జారీ అవుతుంది, అభ్యర్థులు తమ నామినేషన్లను ఫిబ్రవరి 3 వరకు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 4న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 7. కాగా పోలింగ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది.

ఉత్తర ప్రదేశ్ ఐదో దశ, మణిపూర్ మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న జారీ అవుతుంది. ఫిబ్రవరి 8 వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వీటి పరిశీలన ఫిబ్రవరి 9న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 11. కాగా పోలింగ్ ఫిబ్రవరి 27న జరుగుతుంది.

ఉత్తర ప్రదేశ్ ఆరో దశ, మణిపూర్ రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 4న విడుదలవుతుంది. ఫిబ్రవరి 11 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు, వీటి పరిశీలన ఫిబ్రవరి 14న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 16, కాగా పోలింగ్ తేదీ మార్చి 3.

ఫిబ్రవరి 10న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 17 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. వీటి పరిశీలన ఫిబ్రవరి 18న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 21 వరకు గడువు ఉంది. పోలింగ్ మార్చి 7న జరుగుతుంది. పోలింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో పోలింగ్ సమయాన్ని అదనంగా ఓ గంట పొడిగించినట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికలను కోవిడ్ రహిత ఎన్నికలుగా నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని 690 నియోజకవర్గాల్లో కోవిడ్ రహిత, సురక్షిత ఎన్నికలను నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో చర్చించినట్లు తెలిపారు.

ఈ ఎన్నికల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారు 24.9 లక్షల మంది అని తెలిపారు. 11.4 లక్షల మంది మహిళలు తొలిసారి ఓటు వేయబోతున్నట్లుతెలిపారు.

16 శాతం పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు చెప్పారు. మొత్తం పోలింగ్ బూత్‌ల సంఖ్య 2.16 లక్షలు అని తెలిపారు. ఒక్కొక్క పోలింగ్ బూత్‌కు ఓటర్ల సంఖ్యను 1,250కి తగ్గించినట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లను దాఖలు చేయవచ్చునని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేయవచ్చునని తెలిపారు.

ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎలక్షన్‌ అబ్జర్వర్లను నియమించారు. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌లో ఈ వ్యయం రూ..28లక్షలుగా ఉంది. డబుల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్‌ సోకిన వాళ్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఐదు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ రేటును పరిశీలించాము. పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచుతున్నాం. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలి. జనవరి 15వరకు రోడ్ షోలపై నిషేదం విధించారు. పాదయాత్రలు, సైకిల్, బైక్ ర్యాలీలపై నిషేధం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని సుశీల్ చంద్ర తెలిపారు.