AY 4.2 COVID-19 Variant: ప్రమాదకరంగా ఏవై.4.2 వేరియంట్, ప్రపంచ దేశాల్లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్, AY 4.2 తో మన దేశానికి తప్పని కోవిడ్ మూడవ దశ ముప్పు
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Bengaluru, October 27: ప్రపంచ దేశాలు కరోనా సెకండ్ వేవ్ దాటుకుని థర్డ్ వేవ్ లోకి ఎంటరయినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇక మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా డెల్టా AY.4.2 వేరియంట్ డేంజర్ గా మారింది. పలు రాష్ట్రాల్లో ఈ రకం వేరియంట్ (AY 4.2 COVID-19 Variant in India) కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగుళూరులో AY.4.2 కరోనా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ కోవిడ్ థర్డ్ వేవ్ (Karnataka Braces for Possible Third Wave) తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కొత్తగా ముగ్గురికి ఈ వైరస్ సోకడంతో దీని బారీన పడిన వారి సంఖ్య ఏడుకు చేరింది. రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డి రణదీప్ బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ, "రాష్ట్రంలో ఏడు కేసులు (ఏవై.4.2) ఉన్నాయి -- బెంగళూరులో మూడు మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు ఉన్నాయి."కొత్త వేరియంట్ కారణంగా మరణాల నివేదికలు ఏవీ లేవు, అయితే ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ( COVID 19, Karnataka) బెంగళూరుతోపాటు మరో ఐదు జిల్లాల్లో రెండంకెలకు పైగా కొవిడ్‌కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 290 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మందికి వైరస్‌ ప్రబలింది. దక్షిణకన్నడ 30, తుమకూరు 26, హాసన్‌ 20, మైసూరు 18, ఉత్తరకన్నడలో 15 మందికి వైరస్‌ సోకింది. పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 408 మంది కోలుకోగా 10 మంది మృతి చెందారు. 25 జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. 8,583 మంది రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 6,421 మంది ఉన్నారు.

భారత్‌లో కొత్త‌గా 13,451 క‌రోనా కేసులు న‌మోదు, గత 24 గంటల్లో కోవిడ్‌తో 585 మంది మృతి, ప్రస్తుతం దేశంలో 1,62,661 యాక్టివ్ కేసులు

కరోనా కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఏడు జీనోమ్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని మంత్రి సుధాకర్ చెప్పారు.కొత్త కరోనా వేరియంట్ వచ్చినప్పుడల్లా రాష్ట్రం వెంటనే నిపుణుల సలహాలను పొందవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తో చర్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అయితే, రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కొత్త వైరస్ వేరియెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, అది వారిపై తక్కువ ప్రభావం చూపుతుందని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు.ఈ కొత్త వేరియెంట్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వివరించారు.

AY.4.2 మొదటిసారిగా జూలైలో కనుగొనబడింది. ఇది UKలో పది కోవిడ్-19 కేసులలో ఒకదానికి ఈ వైరస్ కారణమైనట్లు కనుగొనబడింది. AY.4.2 వైరస్ డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్ వంటి కొన్ని యూరోపియన్ దేశాలలో కూడా గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కనుగొనబడిన డెల్టా కరోనావైరస్ సబ్‌వేరియంట్, AY.4.2 గురించి ప్రభుత్వ నిపుణుల బృందం పరిశీలిస్తోందని మంగళవారం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

మళ్లీ డేంజర్‌జోన్‌లోకి చైనా, ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు, పలు ప్రావిన్స్‌ల‌లో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి, ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు

ఇక బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు కొత్తగా వెలుగుచేసిన ‘ఏవై.4.2’ వేరియంటే కారణమని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ను డెల్టా ప్లస్‌గా పిలుస్తున్నారు. ఇది డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. బ్రిటన్‌ ఆరోగ్య భద్రతా సంస్థ ఇటీవలే దీనిని వేరియంట్‌ అండర్‌ ఇన్వెస్టిగేషన్‌గా పేర్కొన్నది. భారత్‌లోనూ ఏవై.4.2 రకం కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో ఈ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. అయితే ఏవై.4.2 వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ, ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

AY.4.2 ఉప-వంశం అంటే ఏమిటి?

న్యూకాజిల్‌లోని నార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన మాథ్యూ బాష్టన్, డారెన్ స్మిత్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కరోనావైరస్ యొక్క 75 AY వంశాలు గుర్తించబడ్డాయి, ప్రతి ఒక్కటి వాటి జన్యువులో వేర్వేరు రూపాలలో ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నాయి. ఈ వేరియంట్‌లలో ఒకటైన AY.4 గత కొన్ని నెలలుగా UKలో క్రమంగా వృద్ధి చెందుతోందని, గత 28 రోజుల్లో 63 శాతం కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు.

భారత్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా లేదనే భావనలో ప్రజలు ఉన్నారు. దీంతో కరోనా నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. మాస్క్ లేకుండా యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఇలాగే కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే థర్డ్ వేవ్ ముప్పు త్వరలోనే విరుచుకుపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఒక నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. రాజధాని కోల్‌కతాకు 20 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో కరోనా కేసుల పెరుగుదలపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. దసరా నేపథ్యంలో పోటా పోటిగా దుర్గా పూజా మండపాల ఏర్పాటుతో కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు 25 శాతం మేర పెరిగినట్లు బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. వైరస్‌ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో సోనార్‌పూర్‌లో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం విధించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది.

కరోనా మరణ మృదంగం, రష్యాలో 24 గంటల్లో 1000 మంది మృతి

ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ మొదలైంది. రష్యా, బ్రిటన్‌లో కేసులు అమాంతం పెరిగాయి. చైనాలోనూ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో త్వరలోనే భారత్‌లోనూ థర్డ్ వేవ్ ముప్పు ఉండనుందా? అనే భయాందోళన చెందుతున్నారు. అలాగే అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు మామూలుగానే కొనసాగుతున్నాయి. కొత్త వేరియంట్లు సయితం భారత్‌లో ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రష్యాలో మరింతగా బలపడి.. రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రష్యాలో రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, వెయ్యికిపైగా మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. గత 24 గంటల్లో ర‌ష్యాలో 36,446 కేసులు న‌మోద‌వ్వగా, రికార్డ్ స్థాయిలో 1106 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు క‌ఠిన‌మైన చ‌ర్యలు తీసుకుంటున్నా కేసులు త‌గ్గడం లేదు.. ప్రతిరోజూ వెయ్యికిపైగా మ‌ర‌ణాలు సంభ‌విసున్నా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

ఇలా భారీగా మరణాలు నమోదు కావడానికి ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు వలెనే అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి నవంబర్ 7 వరకూ వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రజ‌లు అత్యవ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావొద్దని, వ్యాక్సిన్ త‌ప్పనిస‌రిగా తీసుకోవాల‌ని, మాస్క్ వినియోగించాల‌ని పుతిన్ ప్రభుత్వం ప్రజ‌ల‌ను కోరింది. 60 ఏళ్లు పైబ‌డిన వ్యక్తులు, చిన్నపిల్లలు బ‌య‌ట‌కు రావొద్దని హెచ్చరించింది. రష్యా పరిష్టితిని చూసి.. మిగతా దేశాలు కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మిగతా దేశాలను హెచ్చరిస్తున్నారు.