Rajasthan Political Crisis: సచిన్ పైలట్‌పై విరుచుకుపడిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, హైకోర్టులో కొనసాగుతున్న విచారణ, పైలట్ అనర్హతపై కోర్టు జోక్యం చేసుకోలేదని తెలిపిన న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సంఘ్వి
File image of Ashok Gehlot with Sachin Pilot (Photo Credits: IANS)

New Delhi, July 20: రాజ‌స్థాన్ మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌తో ( Sachin Pilot) పాటు మ‌రో 18 మంది ఎమ్మెల్యేల‌కు ఆ రాష్ట్ర స్పీక‌ర్ అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. అయితే ఈ కేసులో సచిన్ పైల‌ట్ టీమ్ రాజ‌స్థాన్ హైకోర్టును (Rajasthan High Court) ఆశ్ర‌యించింది. స్పీక‌ర్ ఇచ్చిన నోటీసుల్లో.. స్పీక‌ర్ క‌న్నా ముందుగా కోర్టు నిర్ణ‌యం తీసుకోలేద‌ని న్యాయ‌వాది అభిషేక్ మ‌నూ సంఘ్వి వాదించారు.

స్పీక‌ర్‌ను ప్ర‌శ్నించే హ‌క్కు రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు లేద‌న్నారు. స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు ఇది కుద‌ర‌ద‌న్నారు. కాగా విప్ జారీ చేయడం ద్వారా పార్టీ సమావేశాలకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బలవంతం చేయలేదని రాజస్థాన్ హైకోర్టు తెలిపింది. సచిన్ పైలట్ అభ్యర్ధనపై విచారణ సంధర్భంగా రాజస్థాన్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజస్థాన్‌లో ఆడియో టేపు కలకలం, కేంద్ర మంత్రికి నోటీసులు, ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొవడానికి సిద్ధమన్న షెకావత్, బలనిరూపణకు సిద్ధమైన సీఎం అశోక్ గెహ్లాట్

సచిన్ పైలట్ వర్గం యొక్క పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు జైపూర్ బెంచ్ లో ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాష్ గుప్తా ధర్మాసనం విచారిస్తోంది. రాజ‌స్థాన్ స్పీక‌ర్ సీపీ జోషి త‌ర‌పున సింఘ్వి (Congress leader Abhishek Manu Singhvi) ఇవాళ‌ కోర్టులో వాదించారు. అసెంబ్లీ, స్పీక‌ర్‌ కోర్టు ప‌రిధిలోకి రావ‌న్నారు. "స్పీకర్ ఇప్పుడే నోటీసులు ఇచ్చారు, ఎమ్మెల్యేలను ఇంకా అనర్హులుగా ప్రకటించలేదు. స్పీకర్ ఆదేశాన్ని పరిమిత విధానంలో మాత్రమే సవాలు చేయవచ్చు, కాబట్టి పైలట్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌లో ఎటువంటి ఆధారం లేదు" అని ఆయన అన్నారు.

ప్ర‌స్తుతం స‌చిన్ పైల‌ట్ టీమ్.. ఢిల్లీలోని ఓ రిసార్ట్‌లో ఉన్న‌ది. అయితే అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌డం లేద‌ని, స్పీక‌ర్‌కు నోటీసులు ఇచ్చే హ‌క్కు లేద‌ని వారు కోర్టులో వాదించారు. కాగా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు స‌చిన్ బృందానికి స్పీక‌ర్ జోషి అన‌ర్హ‌త నోటీసులు జారీ చేశారు. శ‌నివారం గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రాను క‌లిసిన అశోక్ గెహ్లాట్‌ అసెంబ్లీ స‌మావేశాలు, బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు సంబంధించిన నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిసింది.

101 సీట్లు వ‌స్తే ప్ర‌భుత్వ ఏర్పాటు

ఒక‌వేళ పైల‌ట్ టీమ్‌పై వేటు వ‌స్తే, అప్పుడు గెహ్లాట్ (Ashok Gehlot) మెజారిటీ మార్క్ 102కు చేరుతుంది. ఆ ద‌శ‌లో ఎమ్మెల్యేల కొనుగోలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రాజ‌స్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉన్నాయి. 101 సీట్లు వ‌స్తే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం గెహ్లాట్‌కు కావాల్సిన సంఖ్య ఉన్నా.. ఆ త‌ర్వాత ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు (Rajasthan Political Crisis) చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. 72 సీట్లు ఉన్న‌ బీజేపీ.. స‌చిన్ పైల‌ట్‌ను ఆహ్వానిస్తే.. ఇక అప్పుడు రాజ‌స్థాన్ రాజ‌కీయం మ‌రింత ఉత్కంఠంగా మారే ఛాన్సు ఉన్న‌ది.

అంత్యాక్షరి ఆడుతున్న అశోక్ గెహ్లాట్ టీం

ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం ఫెయిర్‌మాంట్‌ హోటల్లో విశ్రాంతి తీసుకుంటూ 'హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్' (‘మేమూ ఓ రోజు విజయవంతమవుతాం’) (Hum Honge Kamyaab)అంటూ హుషారుగా గడిపారు. గెహ్లాట్ చుట్టూ 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు చేరి అంత్యాక్షరి ఆడుతున్నవీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వారం కాంగ్రెస్ శానససభ పక్ష సమావేశం జరిగిన తరువాత గెహ్లాట్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు క్యాంపునకు వెళ్లారు.

Updated by ANI

నాటి నుంచి అనేక వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో బయటకు వస్తున్నాయి. వీటిలో ఎమ్మెల్యేలతోపాటు అశోక్ గెహ్లాట్‌ యోగా చేయడం, వంట నేర్చుకోవడం, సినిమాలు చూడటం, క్యారమ్స్‌ ఆడటం, సహచరుడి జన్మదిన వేడుకలు నిర్వహించడం కనిపించింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ విరుచుకుపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా నియంత్రణ నిబంధనలు ఉల్లఘించారని ఆరోపించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 50 మందికిపైగా సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలు హోటళ్లో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా ఆరోపించారు.

సచిన్‌ పైలట్‌పై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ విమర్శల దాడి 

కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటికే సచి‌న్‌ పైలెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమని ప్రభుత్వాన్నిపడగొట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రతిపక్ష పార్టీ యత్నిస్తోందని గెహ్లాట్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌పై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ విమర్శల దాడి పెంచారు.

పైలట్‌ కాంగ్రెస్‌ పార్టీని వెన్నుపోటు పొడిచారని గెహ్లాట్ ఆరోపించారు. ఎవరన్ని కుట్రలు పన్నినా సత్యమే గెలుస్తుందని, తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. సచిన్‌ పైలట్‌ పనికిరాడని తమకు తెలిసినా ఏడేళ్లుగా రాష్ట్ర పీసీసీ చీఫ్‌ను మార్చలేదని గెహ్లాట్ పేర్కొన్నారు. పైలట్ నిష్ప్రయోజకుడు, అయోగ్యుడని అభివర్ణించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీతో కలిసి గత ఆరు నెలలుగా ఆయన కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు గత 6 నెలలుగా బీజేపీతో కలిసి ఆయన కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పీసీసీ ప్రెసిడెంట్ గా సచిన్ పైలట్ ను తప్పించాలని గత ఏడేళ్లుగా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఆయన ఒక అయోగ్యుడని తెలిసి కూడా సర్దుకున్నామని తెలిపారు. నాయకుల మధ్య కొట్లాటలు పెట్టడం తప్ప పార్టీకి ఆయన చేసిందేమీ లేదని చెప్పారు.

ఇంగ్లీష్, హిందీలో బాగా మాట్లాడటం వల్ల ఆయన మీడియా దృష్టిని బాగా ఆకర్షించగలిగాడని గెహ్లాట్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని తాను చెబుతున్నా ఎవరూ నమ్మలేదని చెప్పారు. అమాయకంగా కనిపించే సచిన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదని అన్నారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సచిన్ నిర్బంధంలో ఉన్నారని... తనకు ఫోన్ చేసి వారి బాధలను చెప్పుకుంటున్నారని చెప్పారు. తమతో కలవాలని వారు అనుకుంటున్నారని తెలిపారు. వారి మొబైల్స్ కూడా లాక్కుంటున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్‌ సంచలన ఆరోపణలు

ఈ పరిస్థితులు ఇలా ఉంటే సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ వర్గంలోకి వస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ తిరుగుబాటు నేత ఆఫర్‌ ఇచ్చారని ఆయన బాంబు పేల్చారు. అశోక్‌ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలని కోరినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపణలపై పైలట్‌ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్‌పై పైలట్‌ పరువునష్టం దావా వేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మనేసర్‌ రిసార్ట్స్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారని పైలట్‌ ఆరోపించారు

సచిన్‌ పైలట్‌ తిరుగుబాటును తప్పుపట్టిన కాంగ్రెస్‌ నేత మార్గరెట్‌ అల్వా

ఇక రాజస్ధాన్‌లో అశోక్‌ గెహ్లాట్ ప్రభుత్వంపై సచిన్‌ పైలట్‌ తిరుగుబాటును కాంగ్రెస్‌ నేత మార్గరెట్‌ అల్వా తప్పుపట్టారు. బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధాని కావాలని పైలట్‌ తొందరపడుతున్నారా అని రెబల్‌ నేతను ప్రశ్నించారు. రాజస్ధాన్‌లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, సచిన్‌ పైలట్‌ డిప్యూటీ సీఎంతో పాటు పార్టీ చీఫ్‌గానూ ఎన్నికయ్యారని చెప్పారు. 26 ఏళ్ల వయసులోనే సచిన్‌ పైలట్‌ ఎంపీ అయ్యారని, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఎదిగి పీసీసీ చీఫ్‌గానూ నియమితులయ్యారని ఆమె గుర్తుచేశారు. బీజేపీలో చేరి 45 ఏళ్లకే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారా అని పైలట్‌ను ప్రశ్నించారు.