Stop Rape: ప్రధానోపాధ్యాయుడి ఘాతుకం, మైనర్ విద్యార్థినులకు బలవంతంగా పోర్న్ వీడియోలు చూపుతూ బలత్కారం, కేసు నమోదు చేసిన పోలీసులు
Image used for representational purpose | (Photo Credits: File Image)

Kothagudem, December 16: తల్లిదండ్రుల తర్వాత గురువును దైవంగా భావించమని పెద్దలు చెప్తారు. అంతటి గొప్ప స్థానంలో ఉండి నీచమైన పనులకు ఒడిగడుతున్నారు కొంతమంది కీచకులు. పాఠశాలలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు తల్లీ, తండ్రీ అన్ని తానై వ్యహవరించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు వారి జీవితాన్నే నాశనం చేసే దుర్మార్గమైన పనులు చేసి ఇప్పుడు వార్తలకెక్కాడు.

వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించే 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 మరియు పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితుడిపై మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడనే ఫిర్యాధులు ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం, లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతున్నారు. నిందితుడు కూడా పాఠాలు చెప్పేందుకు విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో తన పాఠశాలలో చదివే 7- 11 ఏళ్ల మధ్య వయసుండే విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు. పాఠాల పేరుతో విద్యార్థినుల్లో ఒకరిని తన ఇంటికి తీసుకెళ్లి అక్కడ బలవంతంగా అశ్లీల వీడియోలను చూపేవాడు. ఆ తర్వాత వారిని లైంగికంగా వేధిస్తూ, పైశాచికంగా అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని ఎవరితో అయినా చెబితే కత్తితో పొడుస్తా అంటూ బెదిరించే వాడు అని పోలీసులు పేర్కొన్నారు.

కాగా, ఈ ఓ విద్యార్థిని అసలు పాఠశాలకు వెళ్లనని మారాం చేస్తూ జబ్బు పడింది. తల్లిదండ్రులు ఆ బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, విషయం మరొకటి అని తెలిసింది. దీంతో ఆ బాలికను ఆరా తీస్తే జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఖంగుతిన్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రధానోపాధ్యాయుడి అసలు స్వరూపం బయటపడింది. నిందితుడు ఒక్క బాలికనే కాదు, మరి కొంతమందిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది. గత ఆగష్టు నెల నుంచి నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు విద్యార్థినులు వెల్లడించారు.

విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.