2008 Mumbai Attacks: ముంబైపై ఉగ్ర పంజా..సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన లాహోర్‌ కోర్టు, 26/11 ఉ​గ్రదాడిలో 166 మంది అమాయకులు మృత్యువాత, వందలాది మందికి తీవ్ర గాయాలు
Hafiz Saeed | (Photo Credits: PTI/File)

Islamabad, November 20: 2008వ సంవత్సరంలో ముంబైలో ఉగ్రవాదుల జరిపిన దాడులతో (Mumbai Terror Attacks) దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి విదితమే. అక్టోబర్ నెలలో 26వ తేదీన దేశ ఆర్థిక రాజధానిని టార్డెట్ చేసిన ఉగ్రవాదులు ముంబై తాజ్‌ హోటల్‌లో కాల్పులకు (2008 Mumbai Attacks) తెగబడింది. ఈ ఘటనలో 166 మంది అమాయకులు మృత్యువాత పడగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముంబై 26/11 ఉ​గ్రదాడి ( 26/11 Mumbai Attacks) సూత్రధారి, జమాత్‌-ఉల్‌-దవా ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు (Hafiz Saeed) పాకిస్తాన్‌ లాహోర్ కోర్టు పదేళ్లపాటు జైలు శిక్ష విధించింది.రెండు ఉగ్రదాడుల్లో దోషిగా తేలడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఉగ్ర కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేసే లాహోర్‌ కోర్టు(యాంటీ టెర్రరిజం కోర్టు) హఫీజ్‌తో పాటు జాఫర్‌ ఇక్బాల్‌, యహ్యా ముజాహిద్‌ లకు పదిన్నరేళ్ల పాటు శిక్ష ఖరారు చేసింది. అతడి తోడల్లుడు అబ్దుల్‌ రెహమాన్‌ మక్కికి ఆర్నెళ్ల శిక్ష పడింది. ఈ మారణకాండలో మొత్తం పది మంది ఉగ్రమూకలు పాల్గొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలు చేశారు. ఇదిలా ఉంటే గతంలో ప్రపంచ ఉగ్రవాదిగా హఫీజ్‌ను ప్రకటించిన ఐక్యరాజ్య సమితి అతడి తల తీసుకు వస్తే 10మిలియన్‌ డాలర్లు బహుమతిగా ఇస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే.

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక సహాయం చేస్తున్న హఫీజ్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం గత ఏడాది జూలైలో అతడిని అరెస్టు చేసింది. ​కట్టుదిట్టమైన భద్రత మధ్య హఫీజ్‌ సయీద్‌ పాక్‌లోని కోట్‌ లాక్‌పాత్ జైలులో ఉన్నాడు. జమాత్‌-ఉల్‌-దవా ప్రతినిధులపై పాకిస్తాన్‌ ఉగ్ర వ్యతిరేక సంస్థ ఇప్పటి వరకు 41కి పైగా కేసులు నమోదు చేసింది. నాలుగు కేసుల్లో హఫీజ్‌ సయీద్‌ దోషిగా తేలగా.. మిగతావి పాక్‌లోని పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

Here's ANI Update:

కాగా ప్రపంచ తీవ్రవాద కార‍్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్న హఫీజ్ పాకిస్తాన్‌ కేంద్రంగా భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నాడని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటిఎఫ్‌) పేర్కొంది. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏటిఎఫ్‌ పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు స్థావరం కల్పించడంపై ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న ఎఫ్‌ఏటిఎఫ్‌ కు భారత్‌ కొన్ని ఆధారాలను అందించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు స్థావరం లేకుండా చేయాలని భారత్‌ తన మిత్ర దేశాలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలను ఎప్పటి నుంచో కోరుతున్న సంగతి కూడా విదితమే.

గత ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై బాంబు దాడికి పాల్పడిన జైషే-మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు కొన్ని పాక్‌ సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని భారత్‌ ఆధారాలతో సహా ఎఫ్‌ఏటిఎఫ్‌ కు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాదులకు మద్దతిస్తుందన్న ఆరోపణల కారణంగా ఎఫ్‌ఏటిఎఫ్‌ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టింది. దీంతో ప్రంపంచ బ్యాంకు, ఏసియన్‌ డెవలప్మెంట్‌ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ వంటి సంస్థలు పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న పాక్‌ వేరే దారి లేక ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది.