New Delhi, FEB 05: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వారికి పీఎంజీకేఏవై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ (Free Ration) అందిస్తున్న విషయం తెలిసిందే. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1.97 లక్షల కోట్లు వెచ్చించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది.
దేశంలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తాజాగా ఓ ఆఫీసు ఆర్డర్ను జారీ చేసింది. ఇందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్).. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం, ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని పంచుకోనుంది. ఆధార్, పాన్, మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే.. నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉన్నవారి డేటాను డీజీఐటీ సిస్టమ్స్ అందిస్తుంది. అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా కీలకం కానుంది. ఈ గుర్తింపు పూర్తయ్యాక కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.