COVID19 in India: భారత్‌లో 30 లక్షలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 69,878 పాజిటివ్ కేసులు నమోదు, 55 వేలు దాటిన కరోనా మరణాలు
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

New Delhi, August 22: భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 69,878 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే అతిపెద్ద సంఖ్య.  తాజా కేసులతో దేశంలో  మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 29,75,702కు చేరింది. నిన్న ఒక్కరోజే 945 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 55,794 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో  దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 63,631 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 22,22,578 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 6,97,330 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఇక ఆగస్టు 21 వరకు దేశవ్యాప్తంగా 3,44,91,073 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,23,836 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

India's COVID19 Update:

 

గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 22.8 మిలియన్లకు చేరుకుంది, మరణాలు 797,000 కు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

శనివారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,864,873 గా ఉండగా, మరణాలు 797,787 కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.

సిఎస్‌ఎస్‌ఇ ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక కేసులు 5,621,035 మరియు 175,350 మరణాలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 3,532,330 ఇన్ఫెక్షన్లు మరియు 113,358 మరణాలతో బ్రెజిల్ రెండవ స్థానంలో నిలిచింది.

ఇక సుమారు 130 కోట్ల జనాభా గల భారతదేశం 2,905,825 కేసులతో మూడవ స్థానంలో ఉంది , ఆ తరువాత రష్యా (944,671), దక్షిణాఫ్రికా (603,338) దేశాలు ఉన్నాయి.