
New Delhi, February 25: భారత్లో కోవిడ్19 మళ్లీ విజృంభిస్తుంది, పలు రాష్ట్రాల్లో రోజూవారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు వైరస్ యొక్క ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు దేశంలో గుర్తించబడటం మరింత ఆందోళన కలిగిస్తుంది. దేశంలో వైరస్ కట్టడి అవుతుందనుకున్న దశలో ప్రజలు స్వీయ నియంత్రణ కోల్పోవడంతో వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 16,738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతోంది. గడిచిన ఒక్కరోజులో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 128 రోజుల్లో ఇదే అత్యధికం.
తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,10,46,914కు చేరింది. నిన్న ఒక్కరోజే 138 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,705 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,799 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,07,38,501 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,39,542 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.21% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.37% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.42% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 16,738 new #COVID19 cases, 11,799 discharges and 138 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,10,46,914
Total discharges: 1,07,38,501
Death toll: 1,56,705
Active cases: 1,51,708
Total Vaccination: 1,26,71,163 pic.twitter.com/hQ8uhjfZDI
— ANI (@ANI) February 25, 2021
ఇక ఫిబ్రవరి 24 వరకు దేశవ్యాప్తంగా 21,38,29,658 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,93,383 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, ఆంధ్రప్రదేశ్లో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,494మంది శాంపుల్స్ ను పరీక్షించగా 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,89,503 కు చేరింది. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 88,17,32గా ఉండగా, రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 7168గా ఉంది. ప్రస్తుతం ఏపీలో 603 కోవిడ్ ఆక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 26 లక్షల మంది వ్యాక్సిన్ పొందినట్లు అంచనా. అధికారిక గణాంకాల ప్రకారం 1,23,66,633 మంది హెల్త్ కేర్ - ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, అలాగే 45 ఏళ్లు పైబడి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారికి కోవిడ్ నివారణ టీకాలు పంపిణీ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాయాత్తం అవుతోంది.