Coronavirus in India: దేశంలో కొత్తగా 28,591 కేసులు నమోదు, 338 మంది కరోనాకు బలి, కోవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ
Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

New Delhi, Sep 12: దేశంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,591 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు (Coronavirus in India) చేరింది. 338 మంది కరోనాకు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,42,655కు పెరిగింది. ఇక, గత 24 గంటల్లో కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ కావడం గమనార్హం. మొత్తం 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 3,84,921 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.

వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345కు చేరుకుంది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 73,82,07,378 మందికి టీకాలు వేయగా, నిన్న ఒక్క రోజే 72,86,883 మందికి టీకాలు వేశారు. మరోవైపు, కేరళలో మాత్రం పరిస్థితి ఇంకా ఆందోళనగానే ఉంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికశాతం ఆ రాష్ట్రం నుంచే వెలుగు చూస్తున్నాయి. కేరళలో నిన్న 20,487 కేసులు నమోదు కాగా, 181 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్ కొత్త సీఎం..పటేల్ సామాజిక వర్గంపై గురి పెట్టిన బీజేపీ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే..

దేశంలో కోవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులు వంటి వాటిపై ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పీడియాట్రిక్‌ కేర్‌ (చిన్నారుల ఆరోగ్య వ్యవస్థ)కు సంబంధించి పడకల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో పడకలు ఏర్పాటు చేసేలా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అధికారులు మోదీకి వ్యవరించారు. దీంతో పాటు కోవిడ్‌ మందుల అందుబాటు, నిల్వలపై రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన వ్యవహారం కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

దేశంలో మహారాష్ట్ర, కేరళలతో పాటు ప్రపంచంలో కూడా కేసులు పెరుగుతున్న వైనాన్ని సమావేశంలో చర్చించారు. ఆక్సిజన్‌ అందుబాటు, కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు వంటి వివరాల గురించి మోదీ ఆరా తీశారు. కనీసం జిల్లాకొకటి చొప్పున దేశంలో ఇన్‌స్టాల్‌ చేయనున్న 961 లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ట్యాంకులు, 1450 మెడికల్‌ గ్యాప్‌ పైప్‌లైన్‌ సిస్టం గురించి సమావేశంపై విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించారు.