COVID19 in India: భారత్‌లో కొత్తగా 31,923 కోవిడ్ కేసులు, 282 మరణాలు నమోదు మరియు 31,990 మంది రికవరీ;  గడిచిన ఒక్క రోజులో కేరళ నుంచే 19 వేలకు పైగా కొత్త కేసుల నిర్ధారణ
Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, September 23: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారీ కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, నిన్నటి కంటే ఈరోజు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఎప్పట్లాగే కేరళ నుంచి అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 31,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా,  282 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 19,675 కేసులు, 142 మరణాలు ఉన్నాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,63,421 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,46,050కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,990 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,28,15,731 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,01,604 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.77% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 0.90 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 22 నాటికి దేశవ్యాప్తంగా 55,83,67,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే  15,27,443 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 71,38,205 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 83.39 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 83,39,90,04 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 61.85 కోట్లు ఉండగా, 21.54 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.