COVID 19 Outbreak in India | PTI Photo

New Delhi, July 15: భారత్‌లో సెకండ్ వేవ్ నియంత్రణకు వచ్చే లోపే థర్డ్ వేవ్ కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే  గురువారం సుమారు  3 వేల మేర కేసులు పెరిగి 41 వేలు దాటాయి అయితే మరణాలు 6 వందల లోపే నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 97.28 శాతంగా మెరుగైన స్థితిలోనే ఉంది.

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 41,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,87,880 చేరింది. నిన్న ఒక్కరోజే 581 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,11,989కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,130 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,01,43,850 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,32,041 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.28% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.33శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.32% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 14 నాటికి దేశవ్యాప్తంగా 43,80,11,958 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,43,488 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 34,97,058 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 39.13 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 39,13,40,491 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 31.35 కోట్లు ఉండగా, 7.78 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.