Second Wave in India: భారత్‌లో నిన్నటితో పోలిస్తే కొద్ది మొత్తంలో పెరిగిన కోవిడ్19 కేసులు, దేశవ్యాప్తంగా కొత్తగా 67,208 మందికి పాజిటివ్, మరో 1 లక్ష మందికి పైగా రికవరీ
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, June 17: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా అదుపులోకి వస్తోంది, ప్రతిరోజూ నమోదయ్యే రోజూవారీ కోవిడ్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులున్నప్పటికీ పాజిటివిటీ రేటు క్రమంగా పడిపోతుండగా, కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి మెరుగుపడుతోంది. తాజాగా దేశంలో కోవిడ్ రికవరీ రేటు 96 శాతానికి పెరిగింది. ఫలితంగా ఆక్టివ్ కేసులు తగ్గుతున్నాయి,  ప్రస్తుతం 71 రోజుల కనిష్ఠానికి ఆక్టివ్ కేసులు చేరడం ఊరట కలిగిస్తుంది. కేసులు తగ్గుతుండటంతో చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు దశల వారీగా ఎత్తివేస్తున్నారు.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు స్వల్పంగా సుమారు 5 వేల మేర పెరిగాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313 చేరింది. నిన్న ఒక్కరోజే 2,330 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,81,903కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,03,570 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,84,91,670 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,26,740 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.93% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.78 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.29% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 16 నాటికి దేశవ్యాప్తంగా 38,52,38,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,31,249 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 34,63,961 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 26.55కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 26,55,19,251 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 21.58 కోట్లు ఉండగా, 4.96 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.