COVID-19 Outbreak in India. | PTI Photo

New Delhi, October 21:  భారతదేశంలో కొవిడ్ తీవ్రత గతంలో కంటే కాస్త తగ్గుముఖం పట్టింది, ఇలాంటి పరిస్థితుల్లో మరింత నియంత్రణ పాటిస్తేనే, వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. లాక్డౌన్ నుంచి అనేక సడలింపులు అందుకుంటున్న నేపథ్యంలో ప్రజలు తమకు తాముగా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో  54,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 76,51,108కు చేరింది. నిన్న ఒక్కరోజే 717 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,15,914 కు పెరిగింది.

మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 61,775 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 67,95,103 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 7,40,090 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక్కరోజులోనే ఆక్టివ్ కేసుల సంఖ్య  8448 తగ్గడం ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 87.36% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 11.12% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.52% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక అక్టోబర్ 20 వరకు దేశవ్యాప్తంగా 9,72,00,379 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,83,608 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో కేసులు  16,09,516కు చేరగా, కొవిడ్ మరణాలు 42,453కు పెరిగాయి. గణాంకాల ప్రకారం మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ మరియు దిల్లీ రాష్ట్రాలు కొనసాగుతున్నాయి.