Justice Surya Kant: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం, జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానంలో నియామకం, 15 నెలలు పాటు పదవిలో కొనసాగనున్న కాంత్

జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) నవంబర్ 24, సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానాన్ని ఆయన భర్తీ చేసారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన పదవీకాలం దాదాపు 15 నెలలు ఉండనుంది.

Justice Surya Kant: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం, జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానంలో నియామకం, 15 నెలలు పాటు పదవిలో కొనసాగనున్న కాంత్
Justice Surya Kant Takes Oath As 53rd Chief Justice of India (Photo Credits: X/@rashtrapatibhvn)

జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసర్ జిల్లాలోని పోట్వార్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు. చిన్నప్పటి నుంచే చదువు పట్ల మక్కువ కలిగిన ఆయన, గ్రామ పాఠశాలల్లో సాధారణ పరిస్థితుల్లోనే విద్యను అభ్యసించారు. 1981లో హిసర్ ప్రభుత్వ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, 1984లో రోహతక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ (LLB) పూర్తి చేశారు. న్యాయమూర్తిగా పనిచేస్తూ కూడా ఆయన విద్యను కొనసాగించారు. 2011లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా LLM పూర్తి చేసి, ఆ కోర్సులో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.

1984లో హిసర్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించిన ఆయన, ఒక సంవత్సరం తర్వాత చండీగఢ్‌కు వెళ్లి పంజాబ్–హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగ, సివిల్, సేవా చట్టాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సూర్య కాంత్ అనేక అధికార సంస్థలు, విశ్వవిద్యాలయాలు, బోర్డులు, కార్పొరేషన్ల తరఫున వాదించారు. 2000లో ఆయన హర్యానా రాష్ట్రంలో అతి పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఒక సంవత్సరం తర్వాత సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు. 2004లో పంజాబ్-హర్యానా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై, అక్కడ దాదాపు 15 సంవత్సరాలు సేవలు అందించారు.

2018లో ఆయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. తరువాత 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఇటీవల సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా రెండు సార్లు సభ్యుడిగా పనిచేసి, ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించే కార్యక్రమాలకు సహకరించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఆయన ముఖ్యంగా రాజ్యాంగ మరియు పౌర హక్కులకు సంబంధించిన అనేక కీలక తీర్పులను ఇచ్చారు. తన పదవీకాలంలో దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించడం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కోర్టులపై భారం తగ్గించేందుకు మధ్యవర్తిత్వం (Mediation) ఎంతో కీలకమని, ఇది న్యాయ వ్యవస్థకు నిజమైన "గేమ్ ఛేంజర్" అవుతుందని అన్నారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన వివాదాలను త్వరితంగా పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులను విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

హర్యానా నుంచి వచ్చిన మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. గ్రామ పాఠశాల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు ఆయన చేసిన ప్రయాణం ఎంతో మందికి ప్రేరణ. న్యాయం అందరికీ చేరాలనే లక్ష్యంతో పనిచేయడం ఆయన పంథా. వచ్చే 15 నెలల్లో కేసుల నిర్వహణలో సమర్థత, వేగవంతమైన తీర్పులు మరియు న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంపై ఆయన దృష్టి సారించనున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 24, 2025 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).