Karti Chidambaram COVID-19 Positive: చిదంబరం తనయునికి కరోనా పాజిటివ్, స్వీయ నిర్బంధంలోకి కార్తీ చిదంబరం, నాతో సమావేశాల్లో పాల్గొన్న వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని వినతి
Karti Chidambaram (Photo Credits: ANI)

New Delhi, August 3: దేశంలోని రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah), కర్నాటక సీఎం యడియూరప్పతో పాటు మరికొంత మంది ప్రముఖులు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కరోనా (Karti Chidambaram COVID-19 Positive) సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి (Home Quarantine) వెళ్లిపోయా. నాతో సమావేశాల్లో పాల్గొన్న వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా’’ అని కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ అగ్రనేతల్లో కరోనా కలవరం, బి.ఎస్.యడ్యూరప్పకు కరోనా పాజిటివ్, దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు, హోమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 పాజిటివ్

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో పాల్గొన్న కేంద్ర కేబినెట్‌ మంత్రులంతా హోం ఐసోలేషన్‌లో ఉండాలని కేంద్రం సూచించింది. కేంద్రం సూచనలతో కేబినెట్‌ మంత్రులు, అధికారులు సోమవారం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నారు. మంత్రులు, అధికారులు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ప్రధానితో పాటు మంత్రులు కూడా కేబినెట్‌ మీటింగ్‌కు హాజరవడంతో.. అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా సోకిన అమిత్‌ షా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అమిత్‌ షా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

అసోం రాష్ట్రానికి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. సెంట్రల్ అసోం పరిధిలోని సమగురి ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాకిబుల్ హుసేన్ కు కరోనా సోకింది. తన భార్య నజ్రీన్ హుసేన్ తోపాటు తనకు కరోనా వచ్చిందని ఎమ్మెల్యే రాకిబుల్ హుసేన్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. కాగా తన కుమారుడికి కరోనా నెగిటివ్ అని తేలిందని ఎమ్మెల్యే హుసేన్ చెప్పారు. అసోంలో హుసేన్ తోసహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు కరోనా వచ్చింది.