Lawyer Couple Hacked To Death: తెలంగాణలో దారుణం, నడిరోడ్డుపై హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్య,  వాహనాన్ని అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపిన దుండగులు, అధికార పార్టీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాల ఆరోపణ
Representational Image | (Photo Credits: PTI)

Manthani, February 18: తెలంగాణలోని మంథని- పెద్దపల్లి హైవేపై బుధవారం పట్టపగలు అందరూ చూస్తుండగా ఇద్దరు న్యాయవాద దంపతులపై జరిగిన హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేసే సుప్రసిద్ధ న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు మరియు అతని భార్య పివి నాగమణి ఓ కేసు విషయమై బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మంథని వచ్చి తిరిగి మధ్యాహ్నం 1:50 సమయంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. మరొక ఖరీదైన నల్లటి కారులో వీరి కారును వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు కల్వచర్ల సమీపంలో అడ్డగించి తన కారులో ఉన్న లాయర్ వామన్ రావును కారులోంచి కిందకు లాగి నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా నరికారు, కారులో ఉన్న అతడి భార్య నాగమణి మెడపై కూడా దుండగులు నరికారు. ఈ హత్య జరుగుతున్నప్పుడు రెండు ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే నిలిచిపోయాయి. రోడ్డుపై అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఒక్కసారిగా నివ్వెరపోయి భయభ్రాంతులకు గురయ్యారు. హంతకులు పని ముగించుకొని వారి కారులోనే క్షణాల్లో అక్కడ్నించి ఎస్కేప్ అయ్యారు.

సినిమా క్రైమ్ సీన్ ను తలపించిన ఈ హత్యోదంతాన్ని అక్కడ ప్రత్యక్షంగా చూసిన చాలా మంది తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఒళ్లు జలదరించే ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, కొద్ది సేపటికి 108 వాహనం వచ్చి దంపతులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వామన్ రావు కొనప్రాణంతో ఉన్నప్పుడు 'కుంట శ్రీను' అనే పేరును ప్రస్తావించినట్లు మరొక వీడియోలో తెలుస్తుంది.

హతమైన ఈ హైకోర్ట్ న్యాయవాద దంపతులిద్దరూ రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్ లాంటి అక్రమ దందాలపైనా ప్రజాప్రాయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు.

ఏదైమేనా స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పట్ల న్యాయవాద మరియు ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ హత్యల వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ హత్యోదంతంపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ఇప్పటికే నిందితులను గుర్తించినట్లు చెప్పారు. వెంటనే కేసును ఛేదించాలని డీజీపీని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, న్యాయవాద దంపతుల హత్యలను తెలంగాణ హైకోర్ట్ బార్ కౌన్సిల్ ఖండించింది. నిరసనగా గురువారం హైకోర్టులో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది.