
Budaun, May 24: భార్య కడుపులో ఉన్నది ఆడ శిశువా? లేక మగ పిల్లాడా? అని తెలుసుకునేందుకు 8 నెలల గర్భిణీ కడుపును కోసి (Man Slits) చూశాడు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2021లో జరిగిన ఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. భార్యపై అమానుష ఘటనకు పాల్పడ్డ అతనికి జీవిత ఖైదు విధించింది. బదౌన్ కు చెందిన పన్నా లాల్ అనే వ్యక్తి తన భార్యపై ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే ఆడపిల్ల పుడుతుందనే భయంతోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డట్లు ఒప్పుకున్నాడు.
గ్రామానికి చెందిన ఓ సాధువు..అతనికి మళ్లీ ఆడపిల్ల పుట్టే అవకాశముందని జోతిష్యం చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన పన్నాలాల్..తన భార్యపై దాడి చేశాడు. 8 నెలల కడుపుతో ఉన్న అతని భార్యపై పైశాచికంగా ప్రవర్తించాడు. కత్తితో కడుపును కోసి (Wife womb) శిశువు లింగం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడ్డ అనితను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ కడుపులో ఉన్న మగ శిశువు మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...దర్యాప్తు పూర్తి చేశారు. సెషన్స్ కోర్టులో పన్నాలాల్ కు జీవిత ఖైదు విధించారు.