Students Continue Protests in Imphal (Photo Credits: X/@LicypriyaK)

Imphal, September 11: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల నిరసనలతో రాష్ట్రం భగ్గుమంటోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర డీజీపీ, రక్షణ సలహాదారుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. మణిపూర్‌లో ఒక రోజు ముందు రాజ్‌భవన్‌కు విద్యార్థులు తమ మార్చ్‌లో భద్రతా దళాలతో ఘర్షణకు దిగడంతో బుధవారం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో విధించిన కర్ఫ్యూ, ఈ ఉదయం కూడా కొనసాగింది, అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో పోలీసులు తరచుగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని సీనియర్ అధికారి తెలిపారు.పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది, కానీ అదుపులో ఉంది," అని పోలీసులు తెలిపారు.

మంగళవారం ఇక్కడ రాజ్‌భవన్‌కు మార్చ్‌లో విద్యార్థులు మరియు భద్రతా దళాల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేత ఐదు లోయ జిల్లాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది. డిజిపిని, రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌ వైపు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయమంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు, ఎప్పటికీ తిరిగి పునరుద్ధరించబడదని కీలక ప్రకటన

వేలాది మంది విద్యార్థులు, మహిళలు ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించగా, వారిని కాంగ్రెస్‌ భవన్‌ వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి. దీంతో విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ వారిపై రాళ్లు, గ్లాస్‌ మార్బుల్‌ బాల్స్‌తో దాడి చేయడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. ఘర్షనల్లో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు.

రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూను విధించారు.ఐదు రోజుల పాటు ఐదు లోయ జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌లో పరిస్థితులను అదుపు చేయడానికి 2,000 మందితో మరో రెండు సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్లను మోహరించనున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో తెలంగాణలోని వరంగల్‌కు చెందిన 58న నంబర్‌ బెటాలియన్‌ను, జార్ఖండ్‌లోని 112 నంబర్‌ బెటాలియన్‌ను తరలించనున్నట్టు మంగళవారం అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధానిలోని ఖ్వైరాంబండ్, కక్వా నౌరెం లైకై ప్రాంతాల్లో భద్రతా బలగాలపై రాళ్ల దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఘర్షణలో 55 మందికి పైగా విద్యార్థులు గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు విద్యార్థుల నాయకులు తెలిపారు.విద్యార్థుల ప్రతినిధులు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి మెమోరాండం సమర్పించారని రాజ్ భవన్ మంగళవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. తమ డిమాండ్ల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.

విద్యార్థులు, ప్రజల మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కాంగ్‌పోక్పి జిల్లాలో సెర్చ్ ఆపరేషన్‌లు మరియు ఏరియా డామినేషన్ కసరత్తులు జరుగుతున్నాయి మరియు ఆయుధాలు మరియు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.