Mann Ki Baat: జనతా కర్ఫ్యూను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, అతిపెద్ద ‘వ్యాక్సినేషన్’ ప్రక్రియ దేశంలో కొనసాగుతుందని తెలిపిన ప్రధాని, మన్ కీ బాత్ సందర్భంగా రేడియో కార్యక్రమంలో మాట్లాడిన నరేంద్ర మోదీ
File image of PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, March 28: మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం మాట్లాడారు. ప్రపంచలోనే అతిపెద్దదైన ‘వ్యాక్సినేషన్’ ప్రక్రియ దేశంలో కొనసాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంతృప్తి వ్యక్తం చేశారు. యూపీలోని జాన్‌పూర్‌లో 109 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్ వేసుకున్నారని, అలాగే ఢిల్లీలో 107 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్ వేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దేశంలో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నిర్వహించుకుంటున్నామని మోదీ గుర్తు చేశారు.

స్వాతంత్య్ర పోరాటంలో స్వాతంత్య్ర సమరయోధులు తమ సర్వస్వాన్ని అర్పించారని, అలా అర్పించడం తమ విధిగా వారు భావించారని మోదీ వివరించారు. అదే బాటలో నడవడానికి దేశ ప్రజానీకానికి వారి వీరోచిత గాథలు ఎంతో ప్రేరణనిస్తాయని తెలిపారు.

అమృత్ మహోత్సవ్ మీకెంత ఉత్సాహాన్ని ఇస్తుందో మీరే చూస్తారు. అదో ప్రవాహం. మరిన్ని సంవత్సరాల పాటు మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. దేశాన్ని నూతన శిఖరాల్లోకి తీసుకెళ్తుంది. దేశం కోసం ఏదైనా చేయాలన్న నూతనోత్సాహం కలుగుతుందని మోదీ పేర్కొన్నారు. మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలందరూ అత్యంత శ్రద్ధతో ఆలకిస్తున్నందుకు జనానికి మోదీ కృతజ్ఞతలు ప్రకటించారు. ఇది తనకెంతో గర్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు.

మన్ కీ బాత్ సందర్భంగా ‘జనతా కర్ఫ్యూ’ ను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘గత సంవత్సరం ఇదే మార్చి మాసంలో ‘జనతా కర్ఫ్యూ’ విధించాం. ఈ పదాన్ని ప్రజలు మొదటిసారిగా విన్నారు. ప్రపంచం మొత్తానికే ఈ జనతా కర్ఫ్యూ అమితాశ్చర్యాన్ని కలిగించింది. దీని ద్వారా ప్రజల అఖండమైన శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇది క్రమశిక్షణకు అపూర్వమైన ఉదాహరణగా నిలిచిపోయింది. జనతా కర్ఫ్యూ సందర్భంగా అశేష ప్రజానీకం చూపించిన క్రమశిక్షణ రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం.’’ అని ప్రధాని మోదీ ప్రకటించారు. అలాగే కరోనా వారియర్స్ చేస్తున్న విశేషమైన సేవకు మద్దతుగా ప్రజలు బయటకు వచ్చి పళ్లెలను కొడుతూ, దీపాలు వెలిగించారని గుర్తు చేశారు. దేశం మొత్తం ఇలా చేయడం వల్ల కరోనా యోధులకు అపారమైన శక్తి సామర్థ్యాలు సిద్ధించాయని, అవే వారిని ముందుకు నడిపించాయని మోదీ తెలిపారు.