New Delhi, Sep 14: కరోనా మహమ్మారి మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon session of Parliament) ప్రారంభం అయ్యాయి. సోమవారం లోక్ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ముఖర్జీ (Pranab) ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రశంసించారు. అలాగే ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్కుమార్, పండిత్ జస్రాజ్, అజిత్ జోగి తదితరులకు సభ సంతాపం తెలిపింది.
కోవిడ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్ –19 (Covid 19) నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్–19 నెగెటివ్ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. ఈ సమావేశాల్లో కరోనా కల్లోలం, కుదేలైన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దుల్లో చైనా దుస్సాహసాలు.. తదితర వైఫల్యాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం సిద్ధమవుతోంది.
మరోవైపు చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రతిపక్షాల వాయిదా తీర్మానం ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరీ, కే సురేశ్లు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇవాళ తొలి రోజు సందర్భంగా వివిధ పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఢిల్లీ అల్లర్ల సమయంలో పోలీసులు మావన హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అంశంపై చర్చ నిర్వహించాలని సీపీఎం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. నీట్ నిర్వహణను వ్యతిరేకిస్తూ .. 12 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే, సీపీఎం పార్టీలు ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.
నేడు లోక్సభలో అయిదు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఎంపీల జీతాలు, పెన్షన్ల సవరణ బిల్లు, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు, పునరుత్పత్తి సాంకేతిక నియంత్రణ బిల్లు, ఫైనాన్షియల్ కాంట్రాక్టు బిల్లు, రైతుల ఉత్పత్తి వాణిజ్యం బిల్లులను ఇవాళ సభలో ప్రవేశపెట్టారు.
<="item" href="https://telugu.latestly.com/india/news/" title="వార్తలు">వార్తలు