Prashant Bhushan Contempt Case: కోర్టు ధిక్కరణ కేసు, ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు, క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్‌ భూషణ్
File image of advocate Prashant Bhushan | (Photo Credits: PTI)

New Delhi, August 31: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష ఖరారైంది. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో (Prashant Bhushan Contempt Case) సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్‌ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా (Prashant Bhushan Fined Re 1) విధించింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించని పక్షంలో.. మూడు నెలల జైలు శిక్ష సహా మూడు ఏళ్ల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని స్పష్టం చేసింది.

న్యాయ వ్యవస్థను, సుప్రీంకోర్టు పని తీరును విమర్శిస్తూ ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan) ఇచ్చిన రెండు ట్వీట్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. నలుగురు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులపై ట్విట్టర్‌లో విమర్శించారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిపైనా విమర్శలు చేశారు. ఈ ట్వీట్లు కించపరిచే విధంగా, కోర్టు ధిక్కార స్వభావంతో ఉన్నట్లు ఆగస్టు 14న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఆగస్టు 20న ఆయనకు శిక్ష విధించవలసి ఉంది. కానీ ఈ ట్వీట్లపై పునరాలోచించుకుని, కోర్టుకు (Supreme Court) క్షమాపణ చెప్పేందుకు ఆయనకు 3 రోజుల గడువు ఇచ్చింది. అయితే ఇవి తాను నిజాయితీతో వ్యక్తం చేసిన అభిప్రాయలని, అందువల్ల తాను క్షమాపణ చెప్పబోనని ప్రశాంత్ భూషణ్ చెప్పారు.

వివాదాస్ప‌ద ట్వీట్ల కేసులో క్ష‌మాప‌ణ‌లు చెప్పమ‌ని సుప్రీం కోరినా.. ప్ర‌శాంత్ భూష‌ణ్ స్పందించ‌లేదు. స‌సేమిరా క్ష‌మాప‌ణ‌లు చెప్పేదిలేద‌న్నారు. దీంతో ఆయ‌న్ను హెచ్చ‌రించి వ‌దిలేయాల‌ని కేంద్రం సుప్రీంను కోరింది. రెండు సార్లు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌శాంత్ భూష‌ణ్ త‌న పంతం వీడ‌లేదు. క్ష‌మాప‌ణ‌ల‌ను చెప్ప‌డం అంటే అంత‌రాత్మ‌ను ధిక్క‌రించ‌డ‌మే అవుతుంద‌ని కూడా ప్ర‌శాంత్ కామెంట్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం ఆయ‌న‌పై ఒక రూపాయి జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.