Rats 'Ate' 500 Kg Of Weed: 580 కేజీలకు పైగా గంజాయిని తిన్న ఎలుకలు, గోడౌన్‌లో దాచిన గంజాయిని ఎలుకలు మాయం చేశాయంటూ కోర్టుకు తెలిపిన మధుర పోలీసులు, ఇంతకీ ఏం జరిగిందంటే?
Rats ate weed Representative Image from Google

Mathura, NOV 24: ఎలుకలు ఇంట్లోని తినుబండారాలను తింటాయని అందరికీ తెలుసు కానీ, గంజాయి (Weed) కూడా తింటాయని వాదిస్తున్నారు మధుర పోలీసులు (Mathura police). తాము సీజ్ చేసి గోడౌన్‌ లో దాచిపెట్టిన 500 కేజీల గంజాయిని ఎలుకలు (rats ate marijuana) తినేశాయంటూ కోర్టుకు సమాధానం ఇచ్చారు. దీంతో వారితీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్లే....ఉత్తరప్రదేశ్‌ లోని మధురలో 2020లో ముగ్గురు వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మధుర పోలీసులు. వారిని రిమాండ్ కు తరలించి...గంజాయిని గోడౌన్‌లో దాచిపెట్టారు. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ నార్కొటిక్స్ డ్రగ్స్ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో స్వాధీనం చేసుకున్న గంజాయి (marijuana) గురించి పోలీసులను న్యాయమూర్తి అడిగారు. దీంతో మొత్తం 581 కేజీల గంజాయిని ఎలుకలు తినేశాయంటూ మధుర ఎస్పీ అభిషేక్ యాదవ్ తెలిపారు. దాని విలువ దాదాపు రూ. 60లక్షలు ఉంటుందని చెప్పారు.

దీంతో వారి తీరుపై కోర్టు కాస్త అసహనం వ్యక్తం చేసింది. పట్టుబడ్డ గంజాయిని దాచిపెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మందలించింది. దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించింది. అంతేకాదు నవంబర్ 26 కల్లా దీనిపై పూర్తిస్థాయి నివేదిక, ఆధారాలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఎలుకలు గంజాయిని తిన్నాయన్న పోలీసుల సమాధానంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ధాన్యాన్ని తినడం తెలుసు కానీ, ఏకంగా 581 కేజీల గంజాయిని ఎలుకలు తినడమేంటని ప్రశ్నిస్తున్నారు.