Shaheen Bagh Demolition Drive: అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు మ‌ళ్లీ కదిలిన బుల్డోజ‌ర్లు, షెహీన్‌భాగ్‌లో పరిస్థితి ఉద్రిక్త వాతావరణం, ఆందోళ‌న‌కు దిగిన స్థానికులు
Visual from Shaheen Bagh (Photo:ANI)

Delhi, May9: దేశ రాజధాని ఢిల్లీలో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు క‌దిలాయి. ఢిల్లీలోని షెహీన్‌భాగ్‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ చేప‌ట్టారు. సౌత్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ష‌హీన్‌భాగ్‌లో ఈ డ్రైవ్ కొన‌సాగ‌నున్న‌ది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి(సీఏఏ) వ్య‌తిరేకంగా ష‌హీన్‌భాగ్‌లో కొన్నేళ్ల క్రితం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే వాస్త‌వానికి ఈ ప్రాంతంలో శుక్ర‌వార‌మే కూల్చివేత ప‌నులు (Shaheen Bagh Demolition Drive) జ‌ర‌గాల్సి ఉంది. కానీ భ‌ద్ర‌తా సిబ్బంది సంఖ్య త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా ఇవాళ మ‌ళ్లీ డ్రైవ్ చేప‌ట్టారు. ష‌హీన్‌భాగ్‌లోకి బుల్డోజ‌ర్లు రావ‌డంతో.. స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించి బుల్డోజ‌ర్ల‌ను అడ్డుకున్నారు. దీంతో షాహిన్‌ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తుగ్ల‌కాబాద్‌, సంగ‌మ్ విహార్‌, న్యూ ఫ్రెండ్స్ కాల‌నీ, ష‌హీన్ భాగ్ (Shaheen Bagh) ప్రాంతాల్లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత జ‌ర‌గ‌నున్న‌ట్లు ఎస్డీఎంసీ చైర్మెన్ రాజ్‌పాల్ మీడియాతో తెలిపారు. అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌కు ప‌ది రోజుల కార్యాచ‌ర‌ణ‌ను ఎస్డీఎంసీ సిద్ధం చేసింది. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, సంఘ విద్రోహ‌శ‌క్తులు ఆక్ర‌మించిన అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేయాల‌ని ఢిల్లీ బీజేపీ నేత ఆదేశ్ గుప్తా న‌గ‌ర మేయ‌ర్‌ను ఇటీవ‌ల కోరారు. ఆ త‌ర్వాత అక్క‌డ బుల్డోజ‌ర్లు రంగంలోకి దిగాయి. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలోనూ అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేసిన విష‌యం తెలిసిందే.

చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారికి అలర్ట్, మొదటి ఆరు రోజుల్లోనే 16 మంది భక్తులు మృతి, గుండె సంబంధిత సమస్యలనన్నవారే అధికం

స్థానిక నివాసితులతోపాటు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన కారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపారు.