Jallikattu Bull Funeral: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, జల్లికట్టు ఎద్దుకు అంత్యక్రియలు, వేలాది మంది హాజరు, మధురై అనంగానల్లూరు గ్రామస్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు
Jallikattu Bull Funeral (Photo-Twitter)

Madurai, April 16: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి చాలా కఠినంగా లాక్‌డౌన్ (Coronavirus lockdown) అమలు చేస్తున్నారు. అయినా కొందరు లాక్ డౌన్ ( lockdown) నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా విస్తరిస్తున్న తమిళనాడులో కూడా లాక్‌డౌన్ ఉల్లంఘన జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఓ ఎద్దుకు (Jallikattu Bull Funeral) అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదు

మదురై (Madurai) సమీపంలోని అనంగానల్లూరు (Alanganallur) దగ్గరున్న ముదవరపట్టి గ్రామంలో జల్లికట్టు ఉత్సవాల్లో మంచి పేరు పొందిన ఓ ఎద్దు మృత్యవాత పడింది. దాని అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ విషయం రచ్చ రచ్చ కావడంతో మేల్కొన్న పోలీసులు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. అయితే, అంత్యక్రియల నిర్వహణ సమయంలో ఎలాంటి అభ్యంతరం తెలపకుండా... ఎద్దు అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. గ్రామస్తులపై కేసు నమోదు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ANI Tweet:

సామాజిక దూర నిబంధన, సీఆర్సీసీ సెక్షన్ 144ను ఉల్లంఘించి ఎద్దు అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లికట్టు పోటీల్లో ఎన్నో పందాల్లో కప్పులు గెలిచిన ఈ ఎద్దు చనిపోవడంతో గ్రామస్తులు కన్నీటితో ఆ ఎద్దుకు ఘనంగా వీడ్కోలు పలికారు. కరోనా, భౌతికదూరం, మాస్కులు గీస్కులు పట్టించుకోలేదు. అంతమందిని కట్టడి చేయలేక పోలీసులు కూడా వారి వెంటనే నడిచారు.ఆ ఎద్దు అంటే తమకు ఎంతో అభిమానం అని గ్రామస్తులు చెప్పారు. దైవంతో సమానం అన్నారు. అందుకే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించామన్నారు.

Here's Jallikattu Bull Funeral Video

ఇదిలా ఉంటే మధురై రెడ్ జోన్ కేటగిరీలో ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా యంత్రాంగం... అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏప్రిల్ 15 నాటికి మదురైలో లాక్‌డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం మూడు వేలకు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. కరోనా వ్యాప్తి చెందకుండా అంత్యక్రియలపై కేంద్రం, రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం తెలిసిందే. కేవలం ఐదుగురే హాజరు కావాలని షరతు ఉంది.