Telangana Paddy Procurement: ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలి, ధాన్యం సేక‌ర‌ణ‌పై ఎంపీ కేశవరావు ప్రశ్నకు బదులిచ్చిన పియూష్ గోయల్
Piyush-Goyal (Photo Credits: Twitter)

New Delhi, Dec 3: పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు నేడు రాజ్యసభలో ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు.ఎవ‌ర్నీ ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న వేయ‌డంలేద‌ని, చాలా సూటిగా ఓ ప్ర‌శ్న వేస్తున్నాన‌ని, తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేక‌రించేందుకు (Telangana Paddy Procurement) కేంద్రం సుముఖంగా ఉందా లేదా అని కేశ‌వ‌రావు ప్ర‌శ్నించారు. అది ఎటువంటి ధాన్య‌మైనా సేక‌రించాల‌న్నారు.

తెలంగాణ నుంచి ప్ర‌తి గింజను కొంటామ‌ని ఓ కేంద్ర మంత్రి చెప్పార‌ని, ఆ ప్ర‌క‌ట‌న‌కు కేంద్రం క‌ట్టుబ‌డి ఉందా లేదా అని ఆయ‌న అడిగారు. గ‌త ఏడాది 94 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్న‌ద‌ని, కానీ ఈ ఏడాది కేవ‌లం 19 ల‌క్ష‌ల ట‌న్నులు మాత్ర‌మే కొనుగోలు చేసిన‌ట్లు కేశ‌వ‌రావు అన్నారు. గ‌త ఏడాది తీసుకున్నంత ఈ ఏడాది తీసుకుంటారా అని కేంద్రాన్ని కేశ‌వ‌రావు ( Telangana MP K Keshava Rao) అడిగారు. రాష్ట్రంలో వ‌రిసాగు విస్తీర్ణం 60 శాతం పెరిగింద‌న్నారు.

అందుకు కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పష్టమైన సమాధానం (Minister Piyush Goyal Clarified) ఇచ్చారు. వానాకాలం పంటను పూర్తిగా కొంటామని వెల్లడించారు. గతంలో తెలంగాణతో చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు ఉంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ చర్చించినట్టు గోయల్ తెలిపారు. ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంతో మొదట 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని, అనంతరం ఆ ఒప్పందాన్ని 44 లక్షల టన్నుల సేకరణకు పెంచామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలి, లోక్‌సభలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

దాని ప్రకారం ఇప్పటివరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వచ్చిందని, ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాల్సి ఉందని స్పష్టం చేశారు. అంత ధాన్యం పంపించకుండా పెండింగ్ లో ఉంచిన తెలంగాణ ప్రభుత్వం... కేంద్రాన్ని ప్రశ్నిస్తుండడం అర్థరహితమని విమర్శించారు. మున్ముందు కాలంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమన్న అంశాన్ని గత ఒప్పందంలోనే పేర్కొన్నామని పియూష్ గోయల్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ అంశంపై పదేపదే ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అటు, ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల టన్నుల ధాన్యం ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 32.66 లక్షల టన్నులే ఇచ్చిందని వెల్లడించారు.

ధాన్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అంశంలో కర్ణాటక అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని, ఇతర రాష్ట్రాలు కూడా ఆ నమూనాను పరిశీలించి, అనుసరించాలని సూచించారు. దేశ‌వ్యాప్తంగా ధాన్య సేక‌ర‌ణ‌ను పెంచామ‌ని, తెలంగాణ‌లోనూ ప్రొక్యూర్మెంట్‌ను పెంచిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ‌లో ఖ‌రీఫ్ సీజ‌న్‌లో 50 ల‌క్ష‌ల ట‌న్నులు ఇస్తామ‌ని చెప్పార‌ని, కానీ కేవ‌లం 32.66 ల‌క్ష‌ల ట‌న్నులు మాత్ర‌మే ఇచ్చార‌న్నారు.