
New Delhi, Nov 30: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదేళ్లు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీలో వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ మీడియాకు వెల్లడించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరూ ఆపలేరు, అమలు చేసి తీరుతామని స్పష్టం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేబినెట్ భేటీలో దేశవ్యాప్తంగా 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లు అందజేయాలని కూడా నిర్ణయించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే దీని లక్ష్యమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకాన్ని రెండేళ్ల పాటు కొనసాగిస్తాం. మహిళా సంఘాలకు డ్రోన్ల కొనుగోలు వ్యయంలో 80 శాతం దాకా ఆర్థిక సాయం అందిస్తాం. ఇందుకు ఏటా రూ.1,261 కోట్లు కేటాయిస్తున్నాం. మిగతా మొత్తాన్ని రుణంగా తీసుకునే అవకాశం కల్పిస్తాం. ఈ డ్రోన్లను వ్యవసాయ సేవల నిమిత్తం రైతులకు మహిళా సంఘాలు అద్దెకిస్తాయి. తద్వారా ఒక్కో సంఘం ఏటా కనీసం రూ.లక్షకు పైగా ఆదాయం పొందవచ్చు’’ అని వివరించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించి రెండేళ్లపాటు అమలయ్యేలా రూ.1,261 కోట్లతో మహిళా సంఘాలకు 15,000 డ్రోన్లను కేంద్రం అందజేయనుంది. వాటిని వ్యవసాయంలో వినియోగించుకునేందుకు వీలుగా రైతులకు అద్దెకు ఇస్తారు. ఆర్థిక పరంగా రైతులు భరించగలిగే ప్రాంతాల్లోని క్రియాశీల మహిళా సంఘాలకు వాటిని అందజేస్తారు. ఇందులో 80% అంటే రూ.8లక్షలను కేంద్రం ఇస్తుంది. మిగిలిన 20%మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది. దీనినీ 3శాతం వడ్డీకి రుణంగా జాతీయ వ్యవసాయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థ ద్వారా అందిస్తారు. డ్రోన్ల వినియోగానికి వెయ్యి హెక్టార్ల వ్యవసాయ భూమి అందుబాటులో ఉండే 10, 15 గ్రామాలను ఒక క్లస్టర్గా రూపొందిస్తారు. డ్రోన్లు నడిపేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలను డ్రోన్ పైలట్లుగా నియమిస్తారు.
మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేస్తామని ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం తెలిసిందే. ఇక పీఎంజీకేఏవైను మరో ఐదేళ్లు కొనసాగించేందుకు రూ.11.8 లక్షల కోట్లు అవసరమని మంత్రి వివరించారు. కరోనా నేపథ్యంలో 2020లో కేంద్రం ఈ పథకాన్ని మొదలు పెట్టడం తెలిసిందే. 2026 నుంచి ఐదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ శాతం తదితరాలపై సలహాలు, సూచనలకు ఏర్పాటు చేయనున్న 16వ ఆర్థిక సంఘం తాలూకు విధి విధానాలకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కమిషన్ 2025 అక్టోబర్ అంతానికల్లా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి జనజాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాన్ని మూడేళ్లు కొనసాగించేందుకు కూడా కేబినెట్ నిర్ణయించింది.
వెయ్యి హెక్టార్లలో డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీవల్ల ఏటా రూ.9.60 లక్షల ఆదాయం వస్తుంది. మహిళా డ్రోన్ పైలట్కు ప్రతి నెలా రూ.15వేలు, సహాయకురాలికి రూ.10వేల వేతనం అందిస్తారు. డ్రోన్ నిర్వహణ, మరమ్మతుకోసం మరో మహిళకు శిక్షణనిచ్చి ప్రతినెలా రూ.5వేల వేతనం చెల్లిస్తారు.
ఆదివాసీల కోసం రూ.24,104 కోట్లతో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇందులో కేంద్ర వాటా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.8,768 కోట్లు. ఈ పథకం కింద 18 రాష్ట్రాల్లోని అత్యంత వెనుకబడిన గిరిజన గ్రూపులుగా గుర్తించిన 75 తెగలకు చెందిన 18.16 లక్షల మందికి ఇళ్లు, రోడ్లు, కొళాయి నీరు, మొబైల్ మెడికల్ యూనిట్లు, వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంగన్వాడీ కేంద్రాలు, బహుళ ఉపయోగ కేంద్రాలు, సోలార్ పవర్ గ్రిడ్, సోలార్ వీధి దీపాలు, మొబైల్ టవర్లు ఏర్పాటు చేస్తారు. ఈ గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు 9 కేంద్ర ప్రభుత్వశాఖల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
లైంగిక వేధింపుల కేసులను విచారించే ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక కోర్టులను మరో మూడేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2018లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 1,023 కోర్టులను కేంద్రం కేటాయించింది. వాటిలో 761 కోర్టులు 2019 నుంచి పని చేస్తున్నాయి. వీటిని మరో మూడేళ్లపాటు పొడిగిస్తూ మిగిలిన కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు నిధులను అందజేయనుంది.