BJP Leader Gokaraju Gangaraju: ఏపీలో బీజేపీకి వైసీపీ షాక్, నర్సాపురం బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి వల, ఏపీ సీఎం జగన్ సమక్షంలో త్వరలో కండువా కప్పుకోనున్న గంగరాజు, వైసీపీ ఎంపీ రఘురామరాజుకు ఝలక్ తప్పదా ?
Andhra pradesh former-bjp-mp-gokaraju-gangaraju-Family-likely-to-join-ycp (Photo-Facebook)

Amaravathi, December 9: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పార్టీ మార్పులతో ఊహించని విధంగా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని(Gannavaram MLA Vallabhaneni vamsi) వంశీతో రాజకీయాలు వేడెక్కగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఏపీ బీజేపీ(AP BJP)లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు (Former BJP MP Gokaraju Gangaraju)వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి.

బీజేపీకి చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా ముఖ్యమంత్రి జగన్ బీజేపీతో రాజకీయంగా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి బీజేపీ ఎంపీగా గెలిచి పార్టీ అధినేత అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు అయిన గోకరాజు గంగరాజుతో సహా ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ(YCP)లో చేరుతున్నారు. 2014 ఎన్నికల్లో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. నర్సాపురం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కె.రఘురామకృష్ణం రాజు విజయం సాధించారు.

ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు ఏపీకి వచ్చినా గోకరాజు అతిథి గృహంలోనే బస చేసేవారు. అమిత్ షాకు గోకరాజు అత్యంత సన్నిహితుడు. గంగరాజుతో పాటుగా ఆయన తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు ఈ మధ్నాహ్నం వైసీపీలో చేరనున్నారు.

బీజేపీ కంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా గోకరాజును చేర్చుకోవటం వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో..తమ కంటే ఢిల్లీలో బీజేపీ నేతలతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్న సొంత పార్టీ ఎంపీ రఘురామరాజుకు సైతం ఈ నిర్ణయం ద్వారా పరోక్షంగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

గోకరాజు వైసిపిలో చేరటమంటే బిజెపికి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే క్షత్రియ సామాజికవర్గంలో గోకరాజుకు గట్టి పట్టుంది. పైగా ఆర్ధికంగా మంచి పటిష్టమైన స్ధితిలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ తో దశాబ్దాలుగా బాగా అనుబంధమున్నవాడు. అందుకనే నరేంద్రమోడి, అమిత్ షా లతో కూడా బాగా సన్నిహితముంది.

ఇదిలా ఉంటే కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణాల్లో గోకరాజు గెస్ట్ హౌస్ కూడా ఉంది. దీన్ని కూడా కూల్చేయాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. మరి ఈ నేపధ్యంలోనే గోకరాజు అధికారపార్టీలో చేరుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం గంగరాజు సోదరుడు నరసింహరాజు భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మరో సోదరుడు రామరాజు గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వీరితోపాటు గంగరాజు పెద్ద కుమారుడైన రంగరాజు ఏలూరు ఆశ్రం కళాశాల డైరెక్టర్‌గా ఉన్నారు.

ఇప్పటి వరకు టీడీపీ పార్టీ మీదనే వైసీపీ ఫోకస్ చేసింది. అయితే, ఇక బీజేపీ నేతలు సైతం తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే వేచి చూడాల్సిన అవసరం లేదని వైసీపీ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.