
Bhopal, August 9: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ (BJP Leader Tarun Chugh) సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chouhan) ‘శివుడైనప్పుడు’.. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ విష్ణుదత్ శర్మ (Vishnu Dutt Sharma) ‘విష్ణువు’ అయినప్పుడు కరోనా మధ్యప్రదేశ్ను ఏం చేయగలదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ అధికారప్రతినిధి భూపేంద్ర గుప్తా బీజేపీకి చురకలు అంటించారు. ‘‘కరోనా విలయతాండవం చేస్తున్నప్పుడు వీరిద్దరూ నిద్రపోయారా..?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్తలకు కరోనా వాలంటీర్లుగా పనిచేసేందుకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటైన సందర్భంగా చుగ్ భోపాల్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివుడు, పార్టీ చీఫ్గా విష్ణువు ఉండగా ఇక మధ్యప్రదేశ్ను మహమ్మారి ఏం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మరోవైపు కరోనా మహమ్మారితో ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య రాష్ట్రంలో 3.28 లక్షల మంది కరోనా బారినపడి మరణించగా మరణాలు ఇంకా అధిక సంఖ్యలో ఉంటాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
పార్టీ కార్యకర్తలు, నేతల మెప్పు కోసమే బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. కోవిడ్ -19 కారణంగా బిజెపి కార్యకర్తలు మరియు నాయకుల కుటుంబాలకు చెందిన 3,500 మంది మరణించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా దీనిని అంగీకరించారని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి 135 కోట్ల డోస్ కోవిడ్ -19 టీకాలు దేశంలోని ఆరోగ్య కేంద్రాలకు చేరుకుంటాయని చుగ్ చెప్పారు. ఆదివారం, మధ్యప్రదేశ్ 10 COVID-19 కేసులను నివేదించింది. మొత్తం కేసుల సంఖ్య 7,91,960 కి చేరుకుంది. మరణాల సంఖ్య 10,514 గా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో రికవరీల సంఖ్య 7,81,298 గా ఉంది, రాష్ట్రంలో 148 యాక్టివ్ కేసులు ఉన్నాయి.