MP Floor Test: సుప్రీంకోర్టుకు మధ్యప్రదేశ్ పొలిటికల్ డ్రామా, కమల్‌నాథ్ ప్రభుత్వానికి బల నిరూపణ తక్షణమే జరగాలంటూ బీజేపీ పిటిషన్, ఈ నెల 26 వరకు అసెంబ్లీ వాయిదా
Former Madhya Pradesh CM Shivraj Singh Chouhan | File Image | (Photo Credits: PTI)

Bhopal, Mar 16: మధ్య ప్రదేశ్‌ రాజకీయ హైడ్రామా (MP political Drama) ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) గడప తొక్కింది. అసెంబ్లీ సమావేశాలను పది రోజుల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇవాళ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అవిశ్వాస తీర్మానానికి రెడీ అంటున్న సీఎం కమల్ నాథ్‌

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో (Madhya Pradesh Assembly) బలపరీక్ష నిర్వహించేలా కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ (Bharatiya Janata Party (BJP) సోమవారం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సహా పది మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

12 గంటల్లోగా కమల్‌నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ శివరాజ్ తరుపున న్యాయవాది సౌరభ మిశ్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన తన పిటిషన్‌లో విన్నవించారు.

Here's ANI Tweet

మైనారిటీ ప్రభుత్వానికి ‘‘కొమ్ముకాస్తూ’’ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చౌహాన్ ఆరోపించారు. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో.. సీఎం కమల్‌నాథ్ బలపరీక్ష కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇవాళ బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ లాల్జీ టాండన్ ఇచ్చిన ఆదేశాలను సైతం స్పీకర్ పక్కనబెట్టారు. కాగా బీజేపీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ లాల్జీ టాండన్‌ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్‌ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.