Congress Working Committee Meet: అధ్యక్ష మార్పు లేఖ ప్రకంపనలు, కొత్త అధినేతను ఎన్నుకోవాలని కోరిన సోనియా గాంధీ, మీరే ఉండాలని కోరుతున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు
Sonia Gandhi at CWC Meet (Photo Credits: ANI)

New Delhi, August 24: గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనేక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో అధ్యక్ష మార్పు జరగాలని చాలామంది కాంగ్రెస్ నేతలు తమ వాదనలు వినిపిస్తూ వచ్చారు. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో (Congress Working Committee Meeting) సోనియా గాంధీ నేను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.  కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్లో సోనియా గాంధీ (Sonia Gandhi) కొన‌సాగాల‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ( Manmohan Singh) ప్ర‌తిపాదించారు.

దీంతో పార్టీ కొత్త అధ్య‌క్షుడి ఎంపీక కోసం కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యులు చ‌ర్చలు జ‌రుపుతున్నారు.ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్‌ పేరును ప్రతిపాదించారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే అంటోని సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. మోదీ అబద్దాలు ఎందుకు చెబుతున్నారు, చైనా-భారత్‌ సరిహద్దు వివాదంపై ప్రధానిపై మండిపడిన రాహుల్ గాంధీ

మిస్టర్ కూల్ గా ఉండే రాహుల్ గాంధీ నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో మాత్రం అగ్గిమీద గుగ్గిలమైనట్లు వార్తలు వస్తున్నాయి. 23 మంది సీనియర్లు కూడబలుక్కుని ఏకంగా సోనియాకు లేఖ రాయడంపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్‌ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి విదితమే. నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసినవారిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ, శశి థరూర్, కపిల్‌ సిబల్, మనీశ్‌ తివారీ, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హూడా తదితరులున్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో ఆ లేఖను సోనియాకు ఎందుకు పంపించారంటూ నేతలను నిలదీశారు. అంతేకాకుండా ఆ సమయంలో సోనియా గాంధీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని, ఆ సమయంలోనే లేఖ పంపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. అసమ్మతి సభ్యులు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్క సారిగా వాతావరణం గంభీరంగా మారిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ లేఖపై మాజీ ప్రధాని మన్మోహన్ కూడా స్పందించారు. ‘‘లేఖ రాయడం చాలా దురదృష్టకరం. ఆ లేఖ హైకమాండ్‌ను, పార్టీని కూడా బలహీనపరుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇక సీనియర్ నేత ఆంటోనీ కూడా లేఖపై సీరియస్ అయ్యారు.  రెండు రకాలుగా దెబ్బ తీసిన కరోనా, కోవిడ్ 19 తర్వాత ప్రపంచం సరికొత్తగా ఆవిష్కృతం అవుతుందని తెలిపిన రాహుల్ గాంధీ, ఇంకా ఎవరేమన్నారంటే..

గత సంవత్సరం ఆగస్ట్‌ 10న సీడబ్ల్యూసీ అభ్యర్థన మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు అయిష్టత చూపి తప్పుకొన్న విషయం తెలిసిందే.

పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని, పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలని సోనియాకు రాసిన లేఖలో సీనియర్లు కోరారు. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుందని వారు ఆ లేఖలో హెచ్చరించారు. అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు.

ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. సాధ్యమైనంత త్వరగా పార్టీ పునరుత్తేజం కోసం చర్యలు చేపట్టాలన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సీడబ్ల్యూసీ సమర్ధంగా పని చేయడం లేదని అభిప్రాయపడ్డారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికే ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదన్నారు. దేశంలో ప్రస్తుతం అభద్రతతో కూడిన భయ వాతావరణం నెలకొని ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనే క్రియాశీల విపక్షంగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను కూడా సీనియర్లు ఆ లేఖలో తప్పుబట్టారు. ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించాలని సూచించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలన్నారు.

ఇదిలా ఉండగా, రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్‌ ఈ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్లమంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ కుటుంబమే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇది సరైన సమయం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టి విపక్షం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బలమైన, ఐక్య విపక్షం లేకపోవడం బీజేపీకి కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా.. మొత్తం పార్టీ కోరుకునే, శ్రేణులందరికీ చిరపరిచితుడైన నాయకుడు కావాలని, గాంధీ కుటుంబ సభ్యులే అందుకు సరైన వారన్నారు.

పార్టీ రాజ్యాంగం ప్రకారం.. సీడబ్ల్యూసీలో పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్లో పార్టీ నేత, 23 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఆ 23 మందిలో 12 మందిని ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ ఎన్నుకుంటుంది. మిగతావారిని పార్టీ ప్రెసిడెంట్‌ ఎంపిక చేస్తారు. 1990 నుంచి సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగలేదు. అప్పటినుంచి, ఏకగ్రీవ మార్గంలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక జరుగుతోంది.

కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించిన తాజా లేఖలో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్‌ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్‌ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్‌ శర్మ, మనీశ్‌ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్‌ దేవ్‌రా, అజయ్‌ సింగ్, ముకుల్‌ వాస్నిక్, జితిన్‌ ప్రసాద, భూపిందర్‌ సింగ్‌ హూడా, రాజిందర్‌ కౌర్‌ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్‌ చవాన్, రాజ్‌ బబ్బర్, అరవింద్‌ సింగ్‌ లవ్లీ, సందీప్‌ దీక్షిత్‌ తదితరులున్నారు.