Kamal Haasan: సుప్రీంకోర్టు గడప తొక్కిన కమల్‌హాసన్, సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఎంఎన్ఎం పార్టీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమంటున్న మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత
File image of MNM chief Kamal Haasan | (Photo Credits: ANI)

Chennai, December 16: పౌరసత్వ సవరణ చట్టానికి (Citizenship Amendment Act 2019) వ్యతిరేకంగా మక్కల్ నీధి మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్ (Kamal Haasan) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సీఏఏని వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్గనిస్తాన్ వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారులకు ఉద్దేశపూర్వకంగా కేవలం మతాల ఆధారంగానే పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ అమలవుతుందని ఎంఎన్‌ఎం పార్టీ ((Makkal Needhi Maiam) ఆరోపిస్తోంది. రాజ్యాంగ విరుద్ధంగా మతం పేరుతో విభజన చేసి పౌరసత్వం ఇచ్చే అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court)కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఎంఎన్‌ఎం ప్రతినిధి ఒకరు తెలిపారు.

ANI Tweet

మతం ఆధారంగా వర్గీకరణ సరికాదని, ఇది రాజ్యాంగంలోని 14, 21వ అధికరణలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని తన వాదన వినిపించింది. ఆ దృష్ట్యా పౌరసత్వ సవరణ చట్టం చెల్లనేరదని తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోర్టును పిటిషనర్ అభ్యర్థించారు.

సీఏఏ ప్రకారం, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ నుంచి మతపరమైన వేధింపుల కారణంగా భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు ఇక్కడ పౌరసత్వం కల్పిస్తారు. వీరంతా 2014 డిసెంబర్ 31కి ముందు వచ్చిన వారై ఉండాలి.