'MAHA' Suspense: కొనసాగుతున్న ‘మహా’ సస్పెన్స్, పట్టు విడవని శివసేన,  ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ భేటీ, ప్రత్యామ్నాయ  ప్రభుత్వ ఏర్పాట్లపై ఊహాగానాలు
Maharashtra govt formation Suspence | (Photo Credits: IANS)

Mumbai,Novemebr 1: మహారాష్ట్రలో అధికార ఏర్పాటుపై ఇంకా ఎటువంటి స్పష్టత రావడం లేదు. సస్పెన్స్‌ అలాగే కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి వారం రోజులు దాటుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అధికారాన్ని సమంగా పంచుకునే తమ డిమాండ్‌ విషయంలో వెనక్కు తగ్గబోమని శివసేన మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవిని సమానంగా పంచుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ సంఘటనతో డిమాండ్ల విషయంలో సేన మెత్తబడిందని, త్వరలో శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా, ఈ విబేధాలకు మరింతగా ఆజ్యం పోస్తూ శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కొడుకు, తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆదిత్య ఠాక్రే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కాకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే షిండే పేరును ఆదిత్య ఠాక్రేనే ప్రతిపాదించారు. కాగా, శివసేన కార్యాలయం ముందు ఆదిత్య ఠాక్రేనే మహారాష్ట్ర సీఎం అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది తొలగించారు. మరోవైపు, కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ముంబైలో సమావేశమయ్యారు. త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.

భారతీయ జనతా పార్టీ వాడుకుని వదిలేసే విధానాన్ని అవలంబిస్తోందని మిత్రపక్షం శివసేన ఆరోపించింది. పొత్తు సమయంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధికార పంపిణీ విషయంలో శివసేన మెత్తబడిందన్న వార్తలు వదంతులేనని ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. ఈ వివాదాలు ఇలా కొనసాగుతుంటే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ గురువారం భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి పదవిని శివసేనతో సమంగా పంచుకునేందుకు బీజేపీ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితుల్లో ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా సమీకరణాలు మారుతున్నాయని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తలను ఎన్సీపీ ఖండించింది. ఇప్పుడు ఈ భేటీ ఆ వార్తలకు బలం చేకూర్చినట్లయింది. కాగా గవర్నర్‌తో భేటీ అనంతరం ఆదిత్య ఠాక్రే విలేకరులతో మాట్లాడుతూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి తుది నిర్ణయం ఉద్ధవ్‌ ఠాక్రేదేనని స్పష్టం చేశారు.

బీజేపీ శివసేన మధ్య అధికార ఏర్పాటులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఎన్సీపీ కార్యకర్తలు ఎన్సీపీ కార్యాలయం ముందు ఒక భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్‌పై ‘ఢిల్లీ సింహాసనానికి మహారాష్ట్ర ఏ నాటికి తలొంచదని చరిత్ర చెబుతోంది’ అని రాసి ఉంది. ఈ వ్యాఖ్యలు మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ కేసు పెట్టినప్పుడు ఆయన అన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ బాగా పుంజుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2014లో కన్నా 13 స్థానాలు ఎక్కువగా, మొత్తం 54 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ(105), శివసేన(56)కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి.