Sukhjinder Singh Randhawa: పంజాబ్ కొత్త సీఎంగా సుక్జిందర్ సింగ్ రంధావా, సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం, ఇంకా అధికారికంగా రాని ప్రకటన
Sukhjinder Singh Randhawa. (Photo Credits: Instagram)

New Delhi, September 19: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సుక్జిందర్ సింగ్ రంధావా (Sukhjinder Singh Randhawa) పేరు కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం. అధికారికంగా పేరు ఇంకా ప్రకటించాల్సి ఉంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ నియమించిన పరిశీలకులు రాహుల్ గాంధీతో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఓ దశలో కొత్త సీఎంగా పీపీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ పేరు బలంగా వినిపించినప్పటికీ చివరి నిమిషంలో పార్టీ పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సిక్కు నేతకే సీఎం పగ్గాలు (Sukhjinder Singh Randhawa Likely to be New Punjab CM) ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది.

పంజాబ్ సీఎం ప‌ద‌వికి కెప్టెన్ అమ‌రీంద‌ర్ రాజీనామా, గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన సింగ్

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో సిక్కు నేత, క్యాబినెట్ మంత్రిగా ఉన్న సుక్జిందర్ సింగ్ రంధావా వైపే అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.