
త్రిభాషా సూత్రం విషయంలో కేంద్రం, తమిళనాడు మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో హిందీ భాషను వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో హిందీ భాషను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లును రూపొందించే ముందు, న్యాయ నిపుణులు, ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం కూడా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రతిపాదిత చట్టం ద్వారా రాష్ట్రంలో హిందీ హోర్డింగ్లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటలను నిషేధించడం లక్ష్యంగా ఉంది. దీనిని భారత రాజ్యాంగానికి లోబడి రూపొందించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా డీఎంకే, పలు ఇతర పార్టీలు హిందీ భాష బలవంతంగా ప్రేరేపించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
తమిళనాడు శాసనసభ ఇటీవలే కేంద్రంలోని అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సిఫారసులను అమలు చేయకూడదని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 9న, పండిట్ జవహర్లాల్ నెహ్రూ హిందీయేతర భాషలకు ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసులు ఉన్నాయని, వాటిని రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయకూడదని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.