RBI Decision: పెద్ద నోట్లపై షాకింగ్ నిర్ణయం దిశగా రిజర్వ్ బ్యాంకు, కనుమరుగు కానున్న రూ.2 వేలు, రూ.500 నోట్లు..!, ప్రణాళికను అమలు చేస్తున్న ఎస్‌బిఐ, ఏటీఎంల్లో నగదు విత్‌డ్రా పెంపు
The Reserve Bank of India (RBI) |

New delhi, October 7:  భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు. అయితే కొన్ని నెలల నుంచి ఆ నోటు కనిపించడం లేదు. ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపిస్తూ వస్తోంది. కాగా ఇకపై పూర్తిగా రూ. 2 వేల నోటు కనుమరుగు కానుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రిజర్వ్ బ్యాంకు నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా ఇప్పటికే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వస్తుండగా తాజాగా ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.2 వేల నోటును నిలిపివేసింది. ఇకపై ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2 వేల నోటు రాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లో రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్టు సమాచారం. దీంతో పాటు త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఇక ఎస్బీఐ ఏటీఎంల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల మొదటి నుంచి కొత్త నిబంధనలు తీసుకుని వచ్చిన బ్యాంక్ లావాదేవీల పరిమితిని కూడా పెంచాలని యోచిస్తుంది. మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎమ్ నుంచి నగదు తీసుకునే వెసులుబాటును కల్పించేందుకు బ్యాంకు అధికారులు యోచిస్తున్నారు. అలాగే SBI ఏటీఎమ్ క్యాష్ విత్‌డ్రా సేవల్లో అనేక మార్పులు తీసుకుని వచ్చింది. డెబిట్ కార్డుపై రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు SBI తన కస్టమర్లకు సూచనలు చేసింది. ఒకవేళ ఈ ఉచిత పరిమితిని దాటితే బ్యాంకు కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను సవరించిన SBI అకౌంట్‌లో కావాల్సినంత డబ్బులు లేకుండా ఏటీఎమ్ ట్రాన్సాక్షన్ జరిపితే ఫైన్ చెల్లించాలనే నిబంధన విధించింది.