22 Weds 30 - A Real Crime Story: 22 వెడ్స్ 30 ఇది వెబ్ సిరీస్ కాదు, రియల్ స్టోరీ! 30 ఏళ్ల యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ఆపై హత్య చేసిన 22 ఏళ్ల యువకుడు, పోలీసుల ఇంటరాగేషన్‌లో షాకింగ్ నిజాలు
Image used for representational purpose only | (Photo Credits: IANS)

New Delhi, August 10: అతడికి 22 ఏళ్లు , ఆమెకు 30 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్లు కాపురం కూడా చేశారు. అంతా బాగుంది అనుకుంటుండగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇదేదో ఇటీవల తెలుగులో పాపులర్ అయిన వెబ్ సిరీస్ కథ కాదు, సమాజంలో జరిగిన యదార్థ సంఘటన.

వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని దిల్లీలో మొన్న ఆదివారం జరిగిన ఓ మర్డర్ కు సంబంధించిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి.

పోలీసుల కథనం ప్రకారం దిల్లీకి చెందిన 22 ఏళ్ల అనూజ్ కుమార్ లాక్డౌన్ సమయంలో తన ప్రేయసి సొంతూరుకు వెళ్లిపోవడంతో మరో అమ్మాయిపై కన్నేశాడు. దిల్లీలోని ఉత్తమ్ నగర్‌కు చెందిన తన కంటే వయసులో పెద్దదైన 30 ఏళ్ల మహిళను ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి ఒక గుడిలో వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం అనూజ్‌కు అతడి స్నేహితులు రంజాన్ ఖాన్ మరియు నౌషాద్ సహాయపడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు, అంతా సవ్యంగా, సౌఖ్యంగా సాగుతుంది వారి జీవితం.

లాక్డౌన్ ముగియడంతో ఇటీవలే అనూజ్ మొదటి ప్రేయసి తిరిగి వచ్చింది. అనూజ్ వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేసిన ఆమె,  తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు తన మొదటి ప్రేయసి అభ్యర్థనను అంగీకరించిన అనూజ్, ఇప్పుడు తనకు ఉన్న అడ్డును తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తాను పెళ్లి చేసుకున్న మహిళను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

మళ్లీ తన స్నేహితులైన రంజాన్ ఖాన్ మరియు నౌషాద్‌లకు జరిగిన విషయాన్ని చెప్పి ముగ్గురు కలిసి ఆమెను చంపేందుకు పతకం రచించారు.

పతకం ప్రకారం, అనూజ్ మరియు నౌషద్ కలిసి బాధితురాలిని దక్షిణ దిల్లీలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. వీరికంటే ముందే అక్కడికి రంజాన్ ఖాన్ చేరుకొని ఉన్నాడు. తన భార్యను చంపేయమని వారితో చెప్పి, ఎవరూ చూడకుండా కాపలాగా అనూజ్ ఉన్నాడు. అనూజ్ చెప్పినట్లుగానే తన ఇద్దరు స్నేహితులు బాధితురాలి చున్నీతోనే ఆమె మెడను గట్టిగా ఉరిబిగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడే ఆమెను పూడ్చిపెట్టారు.

చేసిన నేరం నుంచి  తప్పించుకునేందుకు,  ఆ తర్వాత రంజాన్ ఖాన్ తెలివిగా పోలీసులకు ఫోన్ చేసి, ఎవరో ఒక అమ్మాయిని ఇద్దరు యువకులు బైక్‌పై కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు, ఆమెను వారు నేను చంపుతుండగా చూశానంటూ చెప్పాడు.

దీంతో రంగంలోకి దిగిన దక్షిణ దిల్లీ డీసీపీ అతుల్ ఠాకూర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఫోన్ చేసిన రంజాన్ ఖాన్ కోణం నుంచే విచారణ మొదలు పెట్టారు. అనుమానం వచ్చి తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయాన్ని రంజాన్ ఖాన్ పూసగుచ్చినట్లు పోలీసుల ముందు వెల్లడించాడు. దీంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై చార్జ్ షీట్ తెరిచారు. దక్షిణ దిల్లీలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది.