India Vs Afghanistan: టీ-20 సిరీస్ కు ముందు సత్తా చాటేందుకు ఉవ్విలూరుతున్న టీమిండియా, ఆఫ్ఘన్ తో మ్యాచ్‌ కోసం కసరత్తు

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మీడియా సమావేశంలో వెల్లడించాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు

India Vs Afghanistan: టీ-20 సిరీస్ కు ముందు సత్తా చాటేందుకు ఉవ్విలూరుతున్న టీమిండియా, ఆఫ్ఘన్ తో మ్యాచ్‌ కోసం కసరత్తు
India Cricket Team (Photo Credit: Twitter/@JayShah)

New Delhi, JAN 11: సొంతగడ్డపై సీజన్‌కు భారత్‌ సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సమం చేసుకున్న టీమ్‌ఇండియా..అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు సై అంటున్నది. గురువారం ఇరు జట్లు తొలి పోరులో తలపడనున్నాయి. అమెరికా, వెస్టిండీస్‌ వేదికలుగా జూన్‌లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో సత్తాచాటాలని టీమ్‌ఇండియా (India Vs Afghanistan) క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. 14 నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన రోహిత్‌శర్మపై అందరి కండ్లు ఉన్నాయి. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ తనదైన దూకుడు ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఎవరైనా ఆది నుంచే బౌండరీలతో చెలరేగుతూ జట్లుకు మెరుగైన శుభారంభాలు అందించాడు. అదే జోరు మరోమారు కొనసాగిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండకపోవచ్చు.

 

యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో లోకల్‌ బాయ్‌ శుభ్‌మన్‌ గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే చాన్స్‌ ఉంది. మిడిలార్డర్‌లో తిలక్‌వర్మ, రింకూసింగ్‌, శాంసన్‌, జితేశ్‌శర్మ బరిలో దిగనున్నారు. కీపర్‌ విషయంలో శాంసన్‌, జితేశ్‌ మధ్య పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రింకూసింగ్‌ అంచనాలకు మించి రాణించాడు. ఫినిషర్‌ రోల్‌కు రింకూ పూర్తి న్యాయం చేశాడు. హైదరాబాదీ యువ క్రికెటర్‌ తిలక్‌వర్మ..అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు. సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో మెరుగ్గా రాణిస్తేనే తిలక్‌కు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశముంది. బౌలింగ్‌ విషయానికొస్తే..అర్ష్‌దీప్‌షింగ్‌, అవేశ్‌ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ పేస్‌ బౌలింగ్‌ను ముందుకు నడిపించనుండగా, కుల్దీప్‌యాదవ్‌, రవి బిష్ణోయ్‌ ఒకరికి తుది జట్టులో చోటు దక్కే చాన్స్‌ ఉంది.

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మీడియా సమావేశంలో వెల్లడించాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడని తెలిపాడు. దాదాపు ఏడాది తర్వాత రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ టీ20 జట్టులోకి వచ్చా రు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్‌ వీరిద్దరికి చివరి మ్యాచ్‌. అయితే ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌ వేదికలుగా జూన్‌ లో జరుగనున్న మెగాటోర్నీ కోసం కోహ్లీ, రోహిత్‌కు సెలెక్టర్లు మరోమారు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.

గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ లేకుండానే అఫ్గానిస్థాన్‌ బరిలోకి దిగుతున్నది. యువ క్రికెటర్‌ ఇబ్రహీం జద్రాన్‌..కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌తో తొలిసారి టీ20 ద్వైపాక్షిక సిరీస్‌ ఆడుతున్న అఫ్గన్‌ తమదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించడంలో ముందుంటుంది.

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, గిల్‌, తిలక్‌వర్మ, జితేశ్‌/శాంసన్‌, రింకూసింగ్‌, అక్షర్‌, కుల్దీప్‌, అవేశ్‌ఖాన్‌, అర్ష్‌దీప్‌సింగ్‌, ముకేశ్‌కుమార్‌

అఫ్గానిస్థాన్‌: హజ్రతుల్లా, గుర్బాజ్‌, జద్రాన్‌(కెప్టెన్‌), ఒమర్జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, నబీ, గులాబ్దీన్‌ నయిబ్‌/కరీమ్‌ జనత్‌, ముజీబుర్‌ రెహమాన్‌, ఖాయిస్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫారుఖీ.

(The above story first appeared on LatestLY on Jan 11, 2024 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).