Neeraj Chopra: మరో అరుదైన ఘనత సాధించిన నీరజ్ చోప్రా, ప్రపంచ అత్యుత్తమ స్పోర్ట్స్ అవార్డు నామినేట్, ఇప్పటి వరకు భారత్‌ నుంచి నామినేట్ అయ్యింది ముగ్గురే
Neeraj Chopra’s journey from a chubby kid to Gold medal in Tokyo Olympics

New Delhi, Feb 02: టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రతిష్ఠాత్మకమైన లారస్‌ ‘వరల్డ్‌ బ్రేక్‌ త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు (Laureus World Breakthrough of the Year award) నామినేట్‌ అయ్యారు. నీరజ్ చోప్రా (Neeraj Chopra) నామినేషన్ కు సంబంధించిన వార్తను లారస్‌(Laureus) అకాడమీ వెల్లడించింది. టెన్నిస్‌ స్టార్లు డానీ మెద్వెదెవ్(Daniil Medvedev), ఎమ్మా రడుకాను (Emma Raducanu) తో పాటు నీరజ్‌ చోప్రా జాబితాలో చోటు సంపాదించారు. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో గోల్డ్‌ గెలిచారు. దీంతో ఒక్కసారి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలానే లారస్‌కు నామినేట్‌ అయిన మూడో భారతీయుడు నీరజ్‌ చోప్రా. అంతకుముందు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar), రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ (Vinesh Phogat) నామినేట్‌ అయినవారిలో ఉన్నారు.

తాను లారస్‌ అవార్డుకు నామినేట్ అవ్వడంపై స్పందించారు నీరజ్ చోప్రా. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో నేను సాధించిన ఘనతకు క్రీడా ప్రపంచం గుర్తించడం ఎంతో గౌరవంగా ఉంది. గ్రామీణ భారతం నుంచి వచ్చి ఫిట్‌గా ఉండటం కోసం ఆటలను ఎంచుకున్న ఓ చిన్న కుర్రాడు ఒలింపిక్స్ పోడియం ఎక్కుతాడని ఊహించలేదు. ఇప్పటి వరకు సాగిన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకం గెలవడం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇప్పుడు లారస్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ గొప్ప క్రీడాకారులతో పరిగణనలోకి తీసుకోవడం చాలా బాగుంది’’ అంటూ లారస్ అకాడమీకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నీరజ్‌ చోప్రా చెప్పారు.