
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం పర్యటించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ వార్సికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేపట్టిన పదవులన్నింటికీ వన్నె తెచ్చారని కొనియాడారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దులో వెంకయ్య పాత్ర మరువలేనిదన్నారు. ఎంత ఎదిగినా మూలాలను మరచిపోవద్దని, వెంకయ్య ఏనాడూ మాతృభూమిని మరువలేదని అన్నారు. రైతుల కోసం ఏదో ఒకటి చేయాలంటూ పరితపిస్తుంటారని చెప్పారు.
మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్న గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. వెంకయ్య ఎప్పుడూ రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల గురించే ఆలోచించేవారన్నారు. ఆయన గురించి ఆయన స్వస్థలంలో మాట్లాడాలన్న తన కోరిక ఇవాళ తీరిందని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి అమిత్ షా.. సరస్వతీ నగర్లోని అక్షర విద్యాలయం సందర్శించారు. అక్షరలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు.