AP CM Jagan Birthday Scheme: ఏపీ సీఎం జగన్ పుట్టినరోజున కొత్త స్కీమ్, అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, జనవరి 1 నుంచి రోగులకు రూ.10 వేల ఆర్ధిక సాయం, అమల్లోకి వైయస్సార్ కంటివెలుగు
Andhra CM Ys Jagan Launches New scheme on his Birthday

Amaravathi, October 11:  ఏపీ సీఎం జగన్ పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైయస్ జగన్ ఇప్పుడు మళ్లీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే రోజు కావడంతో ఆ రోజు ప్రజలకు మరికొన్ని పథకాలను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 21న అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి హెల్త్ డేటా ఇందులో ఉంటుంది. ఆ హెల్త్ కార్డుతో ఏ ఆస్పత్రికి వెళ్లినా వారి అనారోగ్య సమస్యల డేటా మొత్తం తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి సమూలంగా మార్చేస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నారని, వాటి సంఖ్య 2వేలకు పెంచుతామని సీఎం చెప్పారు.

డెంగ్యూ, మలేరియా వంటి వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. జనవరి 1 నుంచి 2వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా ప.గో. జిల్లాలో అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక్కో జిల్లాకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏపీలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ప్రైవేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం జగన్ తెలిపారు. కాగా రాష్ట్రంలో అంధత్వాన్ని నివారించేందుకు అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

వైయస్సార్ కంటివెలుగు ప్రారంభం

ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. మార్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, ఏలూరు, పులివెందులతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటాను తయారు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఓ కార్డు ఇస్తామన్నారు.

గతంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2007లో ప్రారంభించారు. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేని నిరుపేదలు, పెద్ద జబ్బులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ కి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. జగన్ సీఎం అయ్యాక ఆ పథకానికి పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు. నేడు రూ.560 కోట్లతో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు . మూడేళ్ల కాలంలో ఆరు దశల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొదటి, రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 16 వరకు 70.41 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తారు. 2020 జనవరి నెలాఖరులోగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటి పరీక్షల తర్వాత ఉచితంగా కళ్ల జోడు ఇస్తారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 5.40 కోట్ల మందికి ఉపయోగం కానుంది.

కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు, తలసేమియా రోగులకు నెలకు రూ.10 వేల ఆర్థిక వేల సాయం చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. జనవరి 1 నుంచి వారికి రూ.10 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. ప్రతి నెల రూ.10వేలు అందుతుందన్నారు. అలాగే పక్షవాతం, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి కూడా పింఛను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోగులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత పూర్తిగా కోలుకునే వరకు కూడా నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇస్తారు.